అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి - జనవరి నుంచి ఇప్పటివరకు...

ఠాగూర్

గురువారం, 8 ఫిబ్రవరి 2024 (08:22 IST)
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి చెందారు. సోమవారం ఇండియానాలోని వారెన్ కౌంటీలోని వనంలో సమీర్ కామత్ అనే భారతీయ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. విద్యార్థి మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ విద్యార్థి ఇటీవలే పర్‌డ్యూ యూనివర్శిటీలో డాక్టోరల్ కోర్సు చేరేందుకు చేరారు. కాగా, అగ్రరాజ్యం అమెరికాలో ఈ యేడాది ఇప్పటివరకు ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. 
 
పర్‌డ్యూ యూనివర్శిటీ పత్రిక కథనం మేరకు... సమీర్ కామత్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో డాక్టోరల్ విద్యార్థిగా ఇటీవలే చేరారు. మాసాచుసెట్స్‌కు చెందిన సమీర్.. యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్ అమ్రెస్ట్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2021లో పర్‌డ్యూ యూనివర్శిటీలో చేరిన ఆయన మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేశాడు. 2025లో అతడి డాక్టోరల్ కోర్సు పూర్తికావాల్సివుంది. ఇంతలోనే సమీర్ కామత్ మృత్యువాతపడ్డారు. కాగా, అతని మృతిగల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 
మరోవైపు, అమెరికాలో ఇప్పటివరకు ఐదుగురు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వారంలో ఇది మూడో ఘటన కావడం గమనార్హం. ఇటీవలే లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి ఒహాయోలేని సిన్సినాటిలో చనిపోయిన విషయం తెల్సిందే. అతని మృతికి కారణాలు ఇంతవరకు తెలియరాలేదు. 
 
అంతకుముందు వారం రోజుల వ్యవధిలోనే మరో ఇద్దరు భారతీయ విద్యార్థులు వివేక్ సైనీ, నీల్ ఆచార్య మరణాలు కలకలం రేపాయి. జనవరి 30వ తేదీన పర్‌డ్యూ కాంపస్‌లో నీల్ ఆచార్య మృతదేహాన్ని గుర్తించగా, జార్జియాలోని లిథోనియా ప్రాంతంలో వివేక్ సైనీని గుర్తు తెలియని దుండగులు దారుణంగా కొట్టి చంపేశారు. అలాగే, జనవరి 20వ తేదీన అకుల్ ధవన్ అనే భారతీయ విద్యార్థి మృతదేహాన్ని యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ సమీపంలో గుర్తించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు