అజర్ మృతిపై క్లారిటీ లేదు : పోలీసుల అదుపులో అజర్ కుమారుడు

బుధవారం, 6 మార్చి 2019 (09:40 IST)
జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజర్ మృతి చెందినట్టు వచ్చిన వార్తలపై పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. కానీ, పాక్‌లోని పలు నిషేధిత ఉగ్ర సంస్థలపై చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా, అజర్ కుమారుడు హమ్మద్ అజర్‌, ఆయన సోదరుడు ముఫ్తీ అబ్దుల్ రౌఫ్ అజర్‌లను పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. 
 
తాజాగా వారిద్దరితో పాటు నిషేధిత సంస్థలకు చెందిన హమ్మద్ అజర్‌ సహా 44 మందిని పాకిస్థాన్‌ అరెస్టు చేసింది. ఈ మేరకు మార్చి 4వ తేదీన అంతర్గత వ్యవహరాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. జాతీయ భద్రతా కమిటీ (ఎన్‌ఎస్‌సీ) నిర్ణయం ప్రకారం.. నేషనల్‌ యాక్షన్‌ ప్లాన్‌ (ఎన్‌ఏపీ)లో భాగంగా అన్ని నిషేధిత సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 
 
ఫలితంగానే వీరందరినీ అరెస్టు చేశారు. నిషేధిత సంస్థలపై చర్యలు కొనసాగుతాయని అంతర్గత వ్యవహారాల శాఖ సహాయ మంత్రి షెహ్ ర్యార్ అఫ్రిది తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారి విచారణ కొనసాగిస్తాం. ఒకవేళ వారు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తేలితే.. వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 
 
కాగా, పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌ బహవల్‌పూర్‌ గ్రామానికి చెందిన మసూద్‌ అజర్‌ జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థను 2000 సంవత్సరంలో ప్రారంభించాడు. ఈయన తన కార్యకలాపాలను పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలాకోట్ కేంద్రంగా సాగిస్తున్నాడు. ఈ కేంద్రాన్నే భారత వైమానికదళం మెరుపుదాడులు నిర్వహించి నేలమట్టం చేసింది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు