ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేసిన కమలా హారీస్ : సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపు

బుధవారం, 20 జనవరి 2021 (22:30 IST)
అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ప్రమాణం చేశారు. దీంతో అమెరికా చరిత్రలోనే తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఆమె పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది. క్యాపిటల్‌ హిల్‌ వెస్ట్‌ ఫ్రంట్‌లో జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కమలాహారిస్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్‌ ప్రమాణం స్వీకారం చేయించారు.

కమలాదేవి హ్యారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్‌ భారతీయురాలు, తండ్రి డోనాల్డ్‌ హ్యారిస్‌ జమైకాకు చెందినవారు. 1964 అక్టోబర్‌ 20 న జన్మించిన కమలా హ్యారిస్‌.. ఓక్‌ల్యాండ్‌లోని వెస్ట్‌మౌంట్‌ హైస్కూల్‌ నుంచి హైస్కూల్‌ విద్య, యూసీ హేస్టింగ్స్‌ యూనివర్సిటీ నుంచి న్యాయవిద్యను, హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ అభ్యసించారు. కమలా హ్యారిస్‌ న్యాయవాదిగా సుదీర్ఘ వృత్తి జీవితాన్ని కలిగి ఉన్నారు.
 
ఇదిలావుంటే, అమెరికా సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు సుప్రీంకోర్టును ఖాళీ చేయించారు. బాంబ్‌ స్క్వాడ్‌ను రప్పించి సుప్రీంకోర్టులో తనిఖీలు చేపట్టారు. 
 
కాగా జో బైడెన్‌ 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఇది జరగడం ఆసక్తికరంగా మారింది. కాగా భారత కాలామానం ప్రకారం రాత్రి 10.30గంటలకు క్యాపిటల్‌ హిల్‌ భవనంలో జో బైడెన్‌ 46వ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. కాగా జో బైడెన్‌తో చీఫ్‌ జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ ప్రమాణం చేయించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు