గర్భంలో ఆడిపిల్ల.. మగబిడ్డ కోసం కడుపులో మేకును దించుకుంది..!

శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (11:57 IST)
గర్భంలో పెరిగే ఆడపిల్లను మగపిల్లాడిగా మార్చేస్తానంటూ గర్భిణి ప్రాణాలమీదకు తెచ్చిన ఘటన పాకిస్థాన్లోని పెషావర్ లో చోటుచేసుకుంది. ఆమె కడుపులో పెరిగేది ఆడపిల్లో మగపిల్లాడో కూడా తెలియని ఆ మాయగాడు మగపిల్లాడు పుట్టేలా చేస్తానని చెప్పిన మాటలు నమ్మిన సదరు బాధితురాలు..తలలో మేకు దింపించుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. పెషావర్‌కు చెందిన ఓ మహిళకు వివాహం తరువాత వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. మగపిల్లాడి కోసం.. భర్త ఇంటిలో భర్త అత్తమామల ఒత్తిడి పెరిగింది. ఈసారి అయినా మగపిల్లాడు పుట్టకపోతే విడాకులు ఇచ్చేస్తామని బెదిరించారు. 
 
ఈ క్రమంలో ఆమె మగపిల్లాడి కోసం మరోసారి గర్భం దాల్చింది. నెలలు నిండుతున్న కొద్దీ మరోసారి ఆడపిల్లే పుడుతుందనే ఆందోళన పెరిగింది.  
 
ఈసారి అయినా మగపిల్లాడు పుట్టకపోతే అబ్బాయి పుట్టకుంటే వదిలిపెట్టేస్తానని భర్త బెదిరింపులే ఆమెకు మనశ్శాంతి లేకుండా చేశాయి. బాబా దగ్గరకు వెళ్లింది. ఆ బాబా మాటలు విని కడుపులో మేకును దించుకుంది. 
 
అలా ఆ మేకు కాస్త లోపలకు దిగగానే బాధతో విలవిల్లాడిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు మేకును బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో వెంటనే పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించారు.
 
అక్కడామెకు పరీక్షలు చేసిన వైద్యులు మేకు పుర్రెను చీల్చుకుని వెళ్లిందని చెప్పారు. కానీ ఆ మేకు మెదడును తాకకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 
  
గర్భిణి తలలో మేకు ఉన్న ఎక్స్‌రే ఫొటోలు అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా..ఈ ఘటనపై డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ బాబాను అరెస్ట్ చేయటానికి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన సదరు మాయగాడు పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు