ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ చిత్రపరిశ్రమలోని లింగ వివక్షపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. హీరోలతో పోలిస్తే హీరోయిన్లను కొన్ని సార్లు తక్కువగా చూస్తారని, చిన్న చిన్న విషయాల్లోనూ ఈ అసమానత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ ఇండియాకు లింగ సమానత్వ గౌరవ రాయబారిగా నియమితులైన సందర్భంగా ఆమె ఈ విషయాలను పంచుకున్నారు.
కొన్నిసార్లు షూటింగులో హీరోలకు తనకంటే మెరుగైన కారు లేదా పెద్ద గదిని కేటాయించడం వంటివి జరుగుతాయని కృతి తెలిపారు. "ఇక్కడ సమస్య కారు గురించి కాదు. కానీ నేను మహిళను అయినంత మాత్రాన నన్ను తక్కువగా చూడకండి, పురుషులతో సమానంగా గౌరవించండి అని నేను కోరుకుంటున్నాను" అని ఆమె ఉద్ఘాటించారు.
కొన్ని సందర్భాల్లో అసిస్టెంట్ డైరెక్టర్లు తనను ముందే సెట్కు పిలిచి, హీరో కోసం ఎదురుచూసేలా చేస్తారని, అలా చేయవద్దని తాను వారితో చెప్పాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు. అసలు ఈ ఆలోచనా విధానంలోనే మార్పు రావాలని ఆమె అభిప్రాయపడ్డారు.
తన తల్లి పెరిగిన కాలంలో ఆడపిల్లలపై ఎన్నో ఆంక్షలు ఉండేవని కృతి వివరించారు. "అమ్మకు ఈత, నృత్యం నేర్చుకోవాలని ఉన్నా ఆ రోజుల్లో కుదరలేదు. కానీ ఆమె చదువు కోసం పోరాడి ప్రొఫెసర్ అయ్యారు. ఆ పోరాట స్ఫూర్తితోనే నన్ను, మా చెల్లిని మా కలలను సాకారం చేసుకోమని ప్రోత్సహించారు" అని తెలిపారు. ఈ కొత్త బాధ్యతలతో లింగ సమానత్వం కోసం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.