చైనా దూకుడు.. డోక్లాం సరిహద్దుల వెంబడి బంకర్ల నిర్మాణం!

మంగళవారం, 24 నవంబరు 2020 (10:51 IST)
చైనా దూకుడు పెంచింది. డోక్లాం సరిహద్దుల వెంబడి బంకర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఓవైపు శాంతి చ‌ర్చ‌ల పేరుతో దృష్టి మ‌ర‌ల్చి.. మ‌రోవైపు గుట్టుచప్పుడు కాకుండా త‌న పని తాను చేసుకుపోతోంది. మొన్నటికిమొన్న భూటాన్ భూభాగంలోకి రెండు కిలోమీట‌ర్ల మేర చొచ్చుకొని వెళ్లి ఏకంగా గ్రామాన్నే నిర్మించినట్లు తేల‌గా.. ఆ త‌ర్వాత 9 కిలోమీట‌ర్ల మేర రోడ్డునూ నిర్మించిన‌ట్లు శాటిలైట్ ఫొటోలు తేల్చాయి. 
 
తాజాగా సించె-లా పాస్‌కు 2.5 కిలోమీట‌ర్ల దూరంలో చైనా ఏకంగా ఆయుధ బంక‌ర్లు నిర్మించిన‌ట్లు తేలింది. మూడేళ్ల కింద‌ట వివాదానికి కార‌ణ‌మైన డోక్లాం నుంచి ఈ ప్రాంతం ఏడు కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. ఈ ఆయుధ బంక‌ర్లు చూస్తుంటే.. చైనా మిలిట‌రీ సంసిద్ధ‌త ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. 
 
డోక్లాం ప్రాంతంలో మ‌రోసారి వివాదం త‌లెత్తితే చైనా బ‌ల‌గాలు స‌మ‌ర్థంగా పోరాడేలా ఈ బంక‌ర్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు నిపుణులు చెబుతున్నారు. ఆ లెక్క‌న ఈ ప్రాంతంలో త‌మ బ‌ల‌గాల‌ను పెంచే ఆలోచ‌న‌లో చైనా ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అదే జ‌రిగితే మ‌రోసారి డోక్లాంలో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా ఉన్నాయి. 
 
నిజానికి గ‌తేడాది డిసెంబ‌రులో ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు లేన‌ట్లు అప్ప‌టి శాటిలైట్ ఫొటోలు స్ప‌ష్టం చేస్తున్నాయి. అయితే అక్టోబ‌రు 28న తీసిన ఫొటోల్లో మాత్రం నిర్మాణాలు పూర్త‌యిన‌ట్లు క‌నిపించింది. అంటే ఏడాదిలోపే ఈ బంక‌ర్ల నిర్మాణాన్ని చైనా పూర్తి చేసింది. ఈ బంకర్ల నిర్మాణాన్ని చూస్తే యుద్ధ సన్నద్ధతలో డ్రాగన్ నిమగ్నమైవున్నట్టు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు