కాశ్మీర్ తమ దేశానికి మెడ నరం వంటిది : పాక్ ఆర్మీ చీఫ్ రహీల్

బుధవారం, 7 సెప్టెంబరు 2016 (12:05 IST)
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కు కాశ్మీర్ మెడ నరం వంటిదన్నారు. అందువల్ల కాశ్మీరీ పౌరులకు దౌత్యపరమైన, నైతిక మద్దతును కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. 
 
పాకిస్థాన్ రక్షణ దినోత్సవాల సందర్భంగా రావల్పిండిలోని జనరల్ హెడ్‌క్వార్టర్స్ వద్ద మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... స్వయం నిర్ణయాధికారం కోసం కాశ్మీరు ప్రజలు చేస్తున్న గొప్ప త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఐక్యరాజ్య సమితి తీర్మానాలను అమలు చేయడమే కాశ్మీరు సమస్యకు ఏకైక పరిష్కారమార్గమన్నారు. 
 
అదేసమయంలో 'నేను శత్రువులందరికీ స్పష్టంగా చెప్పాలనుకుంటున్నదేమిటంటే... పాకిస్థాన్ గతంలోనే బలమైనది, అది ఇప్పుడు మరింత అజేయశక్తిగా, దుర్భేద్యంగా మారింది. మాకు శత్రువుల అన్ని రకాల కుట్రల గురించి తెలుసునన్నారు. సవాలు సైనికపరమైనదైనా, దౌత్యపరమైనదైనా, సరిహద్దులో అయినా, నగరాల్లో అయినా, మా శత్రువులెవరో, మిత్రులెవరో మాకు బాగా తెలుసని, తమను ఏ శక్తీ ఓడించలేదని' ఆయన చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి