జైలులో ఇమ్రాన్ ఖాన్‌పై విష ప్రయోగం జరగొచ్చు : భార్య బుష్రా బీబీ

ఆదివారం, 20 ఆగస్టు 2023 (09:58 IST)
తోషాఖానా కేసులో అరెస్టు అయి, పంజాబ్ ప్రావిన్స్‌లోని అటక్ జైలులో ఖైదీగా ఉన్న తన భర్త, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై విష ప్రయోగం జరగొచ్చని ఆయన భార్య బుష్రా బీబీ (49) ఆందోళన వ్యక్తం చేసారు. అందువల్ల తన భర్తను మెరుగైన వసతులు ఉన్న జైలుకు తరలించాలని ఆమె అధికారులను కోరారు. ఈ మేరకు పంజాబ్ హోం శాఖ కార్యద్శికి ఆమె ఓ లేఖ రాశారు. ఇందులో ఇమ్రాన్‌ను అటక్‌ జైలు నుంచి రావల్పిండిలోని అదియాలాకు తరలించాలంటూ సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. 
 
'70 ఏళ్ల ఇమ్రాన్‌కు ఆయన సామాజిక, రాజకీయ హోదా దృష్ట్యా జైలులో బి-క్లాస్‌ సౌకర్యాలు కల్పించాలి. తనపై గతంలో రెండుసార్లు హత్యాయత్నం జరిగింది. ఆ కేసులతో సంబంధం ఉన్నవారిని ఇప్పటికీ అరెస్టు చేయలేదు. కాబట్టి, ఇమ్రాన్‌ ప్రాణాలకు ఇంకా ప్రమాదం పొంచే ఉంది' అని బుష్రా బీబీ తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారంటూ ఓ వార్తాసంస్థ పేర్కొంది. అలాగే ఇంట్లో వండిన ఆహారాన్ని తినేందుకు తన భర్తకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరినట్లు తెలిపింది. ఇమ్రాన్‌కు బుష్రా బీబీ మూడో భార్య. ఈమె సూఫీయిజం అనుసరించే ఇస్లామిక్‌ ఆధ్యాత్మికవేత్తగా గుర్తింపు పొందారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు