సీఏఏ అమలుపై కేంద్రం నోటిఫికేషన్ : బాణా సంచా పేల్చి సీమా హైదర్ హర్షం

ఠాగూర్

మంగళవారం, 12 మార్చి 2024 (17:00 IST)
దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై దేశంలోని అనేక రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ, ఉత్తరప్రదేశ్ ప్రియుడి కోసం తన నలుగురు పిల్లలతో పాకిస్థాన్ నుంచి స్వదేశానికి వచ్చిన సీమా హైదర్ మాత్రం బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు వర్షం కురిపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. 
 
సీఏఏ అమలుపై కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో సీమా స్పందించారు. ఈ చట్టం అమలును స్వాగతించిన సీమా.. సీఏఏతో తనకు భారత పౌరసత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి సీమా సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో తన నలుగురు పిల్లలు, భర్త (యూపీ యువకుడు)తో కలిసి సీఏఏ చట్టం అమలుపై మాట్లాడారు.
 
'ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిందే చేసి చూపించారు. సీఏఏ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటన చూశాక చాలా సంతోషం అనిపించింది. ఈ చట్టంతో మేం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, నాకు భారత పౌరసత్వం వచ్చేందుకు ఈ చట్టం తోడ్పడుతుందని నమ్ముతున్నా' అంటూ సీమా హైదర్ ఈ వీడియోలో చెప్పారు. 
 
ఈ సందర్భంగా పిల్లలతో కలిసి ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగిలకు జై కొడుతూ నినాదాలు చేశారు. సీఏఏ అమలును స్వాగతిస్తూ కుటుంబంతో కలిసి స్వీట్లు పంచుతూ, టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు