భారత్‌లో రైతు నిరసనలకు కెనడా ప్రధాని మద్దతు

బుధవారం, 2 డిశెంబరు 2020 (06:51 IST)
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన 3 కొత్త వ్యవసాయ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని ఢిల్లీ బయట పోలీసుల లాఠీచార్జిలు, బాష్పవాయువులు, వాటర్‌ ట్యాక్‌లు, ఫిరంగులను సైతం లెక్కచేయకుండా తీవ్రమైన చలిలోనూ రహదారులపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

అన్నదాతలు చేస్తున్న ఈ నిరసనలపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో స్పందించారు. భారత్‌లో రైతుల నిరసనలకు సంబంధించి పలు వార్తలు వినిపిస్తున్నాయని, ఈ పరిస్థితికి చింతిస్తున్నానని తెలిపారు. అయితే నిరసన తెలుపుతున్న రైతులను ఉద్దేశిస్తూ.. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుకు కెనడా ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు.

సమస్యల పరిష్కారంలో చర్చలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, అందుకే వివిధ మార్గాల ద్వారా భారత అధికారులను సంప్రదించామని చెప్పారు. అందరమూ ఒక్కతాటిపైకి వచ్చి సమస్యను పరిష్కరించేందుకు అనువైన సమయం ఇదేనని అన్నారు. ఈ మేరకు జస్టిన్‌ ట్రూడో ఓ వీడియో పోస్ట్‌ చేశారు.
 
కాగా కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తప్పుపట్టింది. కెనాడా ప్రధాని ట్రూడోవ్‌ తప్పుడు సమాచారంతో వ్యాఖ్యలు చేశారని, అసలు ఆయన స్పందించాల్సిన అవసరమే లేదని పేర్కొంది. రైతుల ఆందోళనలనేది తమ దేశ అంతర్గత వ్యవహారమని, అందులో జోక్యం చేసుకోవడం తగదని విదేశాంగ శాఖ పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు