కరోనా భయం : వాషింగ్‌మిషీన్‌లో వేసి శుభ్రం చేసిన ఘనుడు.. తర్వాత ఏం జరిగింది?

సోమవారం, 3 ఆగస్టు 2020 (19:05 IST)
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ పుట్టుకొచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ దీని ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా ప్రతి రోజూ వేల మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. అంతేకాకుండా, కరోనా వైరస్ కరెన్సీ నోట్ల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందనే ప్రచారం సాగుతోంది. దీంతో అనేక మంది కరెన్సీ నోట్లను కూడా కడుగుతున్నారు. మరికొందరు శానిటైజ్ చేస్తున్నారు. అయితే సౌత్ కొరియాకు చెందిన ఓ వ్యక్తి అతితెలివి ప్రదర్శించాడు. కరెన్సీ నోట్లను వాషింగ్ మెషీన్‌లో వేసి శుభ్రపరిచాడు. అవి చివరకు చిరిగి చాటెంతయ్యాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సౌత్ కొరియాకు చెందిన ఇయాన్ అనే వ్యక్తికి కరెన్సీ నోట్ల ద్వారానూ కరోనా వస్తుందన్న భయం పట్టుకుంది. దీంతో సదరు బాధితుడు తన వద్ద ఉన్న 50 వేల వాన్ల (స్థానిక కరెన్సీ)ను వాషింగ్ మెషీన్‌లో వేసి శుభ్రం చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వాటిని అందులో వేసి కాస్తంత వాషింగ్ పౌడర్ పోసి స్విచ్చాన్ చేశాడు.
 
కాసేపటి తర్వాత చూస్తే నోట్లు మొత్తం ముద్దగా మారి, పిప్పిగా మారాయి. మరికొన్ని చినిగిపోయాయి. వాటిని చూసిన అతడికి గుండె ఆగినంత పనైంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 50 వేల వాన్లు. ఆ వెంటనే తేరుకుని వాటిని మూటకట్టి కేంద్ర బ్యాంకుకు పరిగెత్తి అధికారులను కలిసి విషయం వివరించాడు.  
 
నిబంధనల ప్రకారం పాత, చినిగిన నోట్ల స్థానంలో కొత్త వాటిని పొందే అవకాశం ఉంది. అయితే, పూర్తిగా పాడైన నోట్ల స్థానంలో కొత్తవాటిని పొందే అవకాశం లేదు. దీంతో పాక్షికంగా పాడైన నోట్లను లెక్కించి ఆ మేరకు 19 వేల వాన్లు అతడి చేతిలో పెట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు