తైవాన్ ఆగ్నేయ తీరంలో భారీ భూకంపం - రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత

సోమవారం, 19 సెప్టెంబరు 2022 (10:17 IST)
తైవాన్ ఆగ్నేయ తీరాన్ని భారీ భూకంపం ఒకటి కుదిపేసింది. సోమవారం సంభవించిన ఈ భూకంప తీవ్రత భూకంప లేఖినిపై 7.2గా నమోదైనట్టు తొలుత ప్రకటించారు. ఆ తర్వాత దీన్ని 6.9కు తగ్గించారు. ఈ మేరకు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూప్రకంపనల ప్రభావం కారణంగా 146 మంది గాయపడ్డారు.
 
ఈ భారీ భూకంప కేంద్రాన్ని తైటుంగ్ పట్ణానికి ఉత్తరంగా 50 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతున గుర్తించారు. ఇదే ప్రాంతంలో ఆదివారం 6.6 తీవ్రతతో భూకంపం సంభవించగా, సోమవారం అంతకుమించి తీవ్రతతో భూమి కంపించడం ప్రజలను భయాందోళకు గురిచేసింది. భారీ భూప్రకంపలకు పట్టాలపై ఉన్న రైళ్లు సైతం ఊగిపోయాయంటే దీని తీవ్రత ఎంత మేరకు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
 
మరోవైపు, ఈ భూకంప తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జపాన్ ఆధీనంలో దీవులకు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. భారీ స్థాయిలో ప్రకంపనలు రావడంతో ఇళ్ల నుంచి, షాపింగ్ మాల్స్ నుంచి ప్రజలు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ భూకంపం తాలూకు ప్రకంపనలు రాజధాని తైపేలోనూ కనిపించినట్టు ఓ ప్రతినిధి వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు