రక్తసిక్తమైన కాబూల్‌.. మసీదు వెలుపలే ఆత్మాహుతి దాడి.. 27 మంది మృతి

సోమవారం, 21 నవంబరు 2016 (15:10 IST)
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో మరోసారి ఉగ్రమూకలు రెచ్చిపోయారు. ఓ షియా మసీదు వెలుపల ఉగ్రవాది తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. బాంబు పేలుడుతో మసీదు పరిసర ప్రాంతం దద్దరిల్లింది. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయంతో పరుగులు తీశారు.
 
కాబూల్ రక్తసిక్తమైంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. ఆప్ఘనిస్థాన్‌లో షియా తెగలను లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టుల దాడులు జరుగుతున్నాయి. గత జూలైలో జరిగిన దాడిలో 80 మంది మృతి చెందారు. 

వెబ్దునియా పై చదవండి