పఠాన్ కోట్ తరహా దాడి.. భారత యుద్ధ నౌకల్ని పేల్చేందుకు పాక్ కుట్ర

గురువారం, 19 జులై 2018 (13:27 IST)
భారత యుద్ధ నౌకలను పేల్చేందుకు పాకిస్థాన్ కుట్ర పన్నినట్లు ఇంటెలిజన్స్ వర్గాలు పసిగట్టాయి. ఈ విషయాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి చేరవేశాయి. దీంతో నేవీ దళాధికారులు అప్రమత్తమయ్యారు. పఠాన్ కోట్ తరహా దాడికి పాల్పడి, విశాఖ తీరంలో ఉన్న యుద్ధ నౌకలను, జలాంతర్గాములను ధ్వంసం చేయాలన్న లక్ష్యంతో జైషే మొహమ్మద్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. 
 
ఇందుకుగాను ఇప్పటికే పదిమంది ఉగ్రవాదులు డీప్ సీ డైవర్లుగా శిక్షణ పొందారని, వీరంతా ముజఫరాబాద్ సమీపంలో ఉన్న కెల్, దుధినిహల్, లీపా లోయల గుండా ఇండియాలో చొరబడవచ్చని ఇంటెలిజెన్స్ భావిస్తోంది. 
 
సముద్ర అంతర్భాగం ద్వారా జలాంతర్గాముల వద్దకు చేరుకుని.. వాటిని పేల్చే సాంకేతికత గురించి వారికి పూర్తి అవగాహన కూడా వుందని ఇంటలిజెన్స్ తెలిపింది. ఆధునిక ఆయుధ శిక్షణనూ వారు పూర్తి చేసుకున్నారని ఇంటెలిజెన్స్ సంస్థలను సమన్వయం చేసే మల్టీ ఏజెన్సీ సెంటర్ పేర్కొంది. నిఘా సంస్థలు హెచ్చరించడంతో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు భారత నేవీ అధికారులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు