అనుకున్నంత పని చేసిన ట్రంప్.. భారతీయ టెక్కీలకు షాక్

మంగళవారం, 23 జూన్ 2020 (08:29 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పని చేశారు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంతో భారత టెక్కీలకు శరాఘాతంగా మారింది. కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయిన వేళ, అధ్యక్ష ఎన్నికలను ఆన ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో హెచ్-1బీ వీసాలను తాత్కాలికంగా రద్దు చేస్తూ, మెరిట్ ఆధారిత వీసాలను జారీ చేయాలని కార్యనిర్వాహక అధికారులను అదేశించారు.
 
"మెరిట్ ఆధారిత ఇమిగ్రేషన్ వ్యవస్థలోకి మారుతున్నాము" అని వైట్ హౌస్ ఓ మీడియా ప్రకటనలో పేర్కొంది. అధ్యక్షుడి ఆదేశాల మేరకు హెచ్-1బీ వీసాలు, హెచ్-4, ఇతర వర్క్ వీసాలను ఈ సంవత్సరం చివరి వరకూ సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించింది. 
 
మొత్తం ఇమిగ్రేషన్ వ్యవస్థను సంస్కరించి, అత్యధిక నైపుణ్యంగల వారికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ, అమెరికన్ల ఉద్యోగాలను కాపాడుతామని వైట్ హౌస్ పేర్కొంది.
 
తాజా నిర్ణయాల ప్రకారం, హెచ్-1బీ వీసాల జారీలో అమెరికాకు వచ్చే వారికి ఆయా సంస్థలు అత్యధిక వేతనాన్ని ఆఫర్ చేయాల్సి వుంటుంది. అంటే, సదరు ఉద్యోగి అమెరికాలో ఎంతో అవసరమని కంపెనీలు భావించాల్సివుంటుందని శ్వేతసౌధం తెలిపింది. 
 
ఇదేసమయంలో చట్టాల్లోని లొసుగులను సైతం సవరించాలని నిర్ణయించినట్టు అధికారులు వ్యాఖ్యానించారు. అమెరికన్లను ఉద్యోగాల నుంచి తీసేసి, తక్కువ వేతనాలకు విదేశాల నుంచి కార్మికులను నియమించుకుంటున్న కంపెనీలను అడ్డుకుంటామని తెలిపారు.
 
ఈ సంస్కరణలతో అమెరికన్ ఉద్యోగుల వేతనాలు రక్షించబడతాయని, నైపుణ్యవంతులైన ఉద్యోగులు విదేశాల నుంచి వచ్చే పక్షంలో వారికి అడ్డంకులు కలుగబోవని వైట్ హౌస్ ఇదే ప్రకటనలో తెలియజేసింది. 
 
"హెచ్-1బీ వీసాల జారీ విధానాన్ని సంస్కరిస్తామని, అమెరికన్ల ఉద్యోగాలను కాపాడుతూ, నిరుద్యోగుల సంఖ్యను తగ్గించడమే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యం" అని ఉన్నతాధికారి ఒకరు కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడుతూ, మీడియాకు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు