దీనికి కారణం లేకపోలేదు. పాకిస్థాన్ వద్ద పుష్కలంగా అణ్వస్త్రాలు ఉండటంతో తమపై భారత్ దాడి చేస్తే అణ్వస్త్ర దాడి చేస్తామంటూ పదేపదే హెచ్చరిస్తూ వస్తోంది. అయితే, తాము భారతపై ఉగ్రవాద దాడులకు పాల్పడినా భారత ఏమీ చేయకూడదన్నది పాక్ ధోరణి. ఈ ధోరణిని సహించాల్సిందేనా? అణ్వస్త్ర దాడికి భయపడి పాక్ ఉగ్రవాదాన్ని భరించాల్సిందేనా? యుద్ధం వస్తే పాక్ తప్పనిసరిగా అణ్వస్త్ర ప్రయోగం చేసేస్తుందా? అనే అంశాలపై ఇపుడు చర్చ సాగుతోంది.
ఒక దేశంపై అణ్వస్త్రాలు ప్రయోగించాలన్న నిర్ణయాన్ని మరో దేశం తీసుకోవడం అంత ఆషామాషీ కాదు. కొన్ని లక్షల మందిని దారుణంగా చంపడానికి తగిన కారణాలు ఉన్నాయని ఆ దేశం ప్రపంచానికి చాటాల్సి ఉంటుంది. ప్రపంచం దానిని విశ్వసించాల్సి ఉంటుంది. ఎందుకంటే నేడు అణ్వస్త్ర ప్రయోగం ఎక్కడ ఏ దేశంపై జరిగినా దానివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ప్రపంచ దేశాలకు చమురు సరఫరా వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది.
అయితే, అణ్వస్త్ర ప్రయోగం గురించి నేతలు, అధికారులు మాట్లాడే మాటలు, చేసే హెచ్చరికలు కూ డా అణ్వస్త్రాలంత శక్తిమంతంగా పనిచేస్తుంటాయి. అందువల్ల అణ్వస్త్రాలకు సంబంధించి యుద్ధ సమయంలోనే కాదు, శాంతి సమయంలో కూడా అనేక వ్యూహ ప్రతివ్యూహాలు, మాటల పోటీలు జరుగుతుంటాయి. భారత, పాక్ మధ్య కొన్నేళ్లు ఇలాంటి వాతావరణమే నెలకొని ఉంది.