ప్రపంచం కొత్త ప్రమాదకర దశలోకి అడుగుపెట్టింది : డబ్ల్యూహెచ్ఓ

శనివారం, 20 జూన్ 2020 (12:59 IST)
కరోనా మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచం కొత్త ప్రమాదకర దశలోకి అడుగుపెట్టిందని హెచ్చరించింది. లాక్డౌన్‌తో ప్రజలు విసుగెత్తిపోయారని.. దీంతో కరోనా సంక్షోభం కొత్త ప్రమాదకర దశలోకి అడుగుపెట్టిందని ఆ సంస్థ చీఫ్ టెడ్రోస్ హెచ్చరించారు. 
 
'ప్రస్తుతం ప్రపంచం కొత్త ప్రమాదకర దశలోకి అడుగుపెట్టింది. లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన ప్రజల విసిగెత్తిపోయారు. అయితే వైరస్ ఇప్పటికీ వెగంగా వ్యాప్తిస్తోంది' అని వ్యాఖ్యానించారు. 
 
లాక్డౌన్‌ల కారణంగా ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన నష్టం జరుగుతున్నప్పటికీ ఈ మహ్మమారి వల్ల ఇప్పటికీ పెను ప్రమాదం పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి మరి కొన్ని నెలల పట్టే అవకాశం ఉన్నందుకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 
 
కాగా, ప్రపంచంలో దాదాపు 4.5 లక్షల మందికి కరోనా బలైన విషయం తెల్సిందే. మొత్తం 80.5 లక్షల మంది ఈ వ్యాధికి సోకినట్టు తాజాగా లెక్కలు చెబుతున్నాయి. 
 
భారత్‌ను వణికిస్తున్న కరోనా 
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా 14,516 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒకరోజు కేసుల సంఖ్యలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. 
 
అలాగే 24 గంటల్లో 375 మంది మరణించడం జరిగింది. తాజా కేసుల చేరికతో మొత్తం కేసుల సంఖ్య 3,95,048కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
ప్రస్తుతం 1,68,269 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 2,13,831 మంది చికిత్స తరువాత డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. ఇప్పటివరకూ 12,948 మంది మరణించారని వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు