ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో మంగళవారం రాకెట్ దాడులు జరిగాయి. మరో రెండు రోజుల్లో ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా, రెండు కీలకమైన భవనాలపై తీవ్రవాదులు రాకెట్ దాడులు జరిపారు. మొదటి రాకెట్ దాడి కాబూల్లోని అధ్యక్ష భవనంపై జరగ్గా, రెండో రాకెట్ పోలీసు ప్రధాన కార్యాలయానికి సమీపంలోకి చొచ్చుకొచ్చింది.
తాజా రాకెట్ దాడుల్లో ఎవరూ గాయపడలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా విధ్వంసకాండ సృష్టిస్తామని ఆఫ్ఘనిస్థాన్లో ప్రాబల్యం ఉన్న తాలిబాన్ తీవ్రవాదులు ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా అధ్యక్ష భవనం, పోలీసు ప్రధాన కార్యాలయంపై తీవ్రవాదులు రాకెట్ దాడులు జరపడంతో ఎన్నికల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది.
నగరం నడిబొడ్డున ఉన్న అధ్యక్ష భవనం ప్రాంగణంలోకి రాకెట్ చొచ్చుకొచ్చింది. ఈ దాడి కారణంగా పటిష్ట భద్రత ఉండే అధ్యక్షుడి ప్యాలస్లో కొంతమేర ఆస్తినష్టం సంభవించింది. కాబూల్ నగరంలో ఈ నెలలో రెండుసార్లు రాకెట్ దాడులు జరిగాయి. ఇదిలా ఉంటే తాజా దాడులను తామే జరిపామని తాలిబాన్ ప్రతినిధి ఒకరు ఓ వార్తా సంస్థకు ఫోన్లో చెప్పాడు.
తాలిబాన్లు దేశ రాజధానిపై నాలుగు రాకెట్ దాడులు జరిపారని అతను వెల్లడించాడు. అయితే దీనికి సంబంధించి ఇతర వివరాలేవీ చెప్పలేదు. ఇదిలా ఉంటే గత శనివారం కాబూల్లో నాటో దళాల ప్రధాన కార్యాలయంపై తాలిబాన్లు ఆత్మాహుతి కారు బాంబు దాడి నిర్వహించారు. ఫిబ్రవరి తరువాత కాబూల్లో జరిగిన భారీ బాంబు దాడి ఇదే. ఈ దాడిలో ఏడుగురు ఆఫ్ఘనిస్థాన్ పౌరులు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు.