ఆఫ్ఘన్‌లో అభివృద్ధి పనులతో పాక్‌కు చికాకు

ఏళ్ల తరబడి తాలిబాన్ తీవ్రవాదులతో అమెరికా నేతృత్వంలోని నాటో సంకీర్ణ సేనలు సాగించిన యుద్ధం కారణంగా తీవ్రం నష్టపోయిన ఆఫ్ఘనిస్థాన్‌లో భారత్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్థాన్ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో భారత్ చురుగ్గా పాల్గొంటుండటం పాకిస్థాన్‌కు చికాకు తెప్పిస్తోందని బుధవారం అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనం వెల్లడించింది.

ఆఫ్ఘనిస్థాన్‌లో భారత్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు పొరుగునున్న పాకిస్థాన్‌కు ఆందోళన చెందుతోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం సారాంశం. "భారత్- ఆఫ్ఘనిస్థాన్ స్నేహబంధం, ఆందోళనలో పాకిస్థాన్" టైటిల్‌తో వాల్‌స్ట్రీట్ జర్నల్ ఈ కథనాన్ని వెల్లడించింది.

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ల శకం ముగిసిన తరువాత ఆ దేశ పునర్నిర్మాణానికి 1.2 మిలియన్ డాలర్ల సాయం చేస్తామని భారత ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్థాన్‌లో భారీస్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టిన తొలి ఐదు దేశాల్లో భారత్ కూడా ఒకటి. అమెరికా, బ్రిటన్, జపాన్, కెనడా దేశాల తరువాత భారత్ నుంచే ఆఫ్ఘనిస్థాన్ ఎక్కువ సాయం పొందుతోంది.

పాకిస్థాన్ తొలి పది దేశాల్లో కూడా లేదు. ఆఫ్ఘన్‌లో తాలిబాన్ల శకం ముగిసిన తరువాత ఆ దేశంతో, అక్కడి ప్రజాస్వామ్య ప్రభుత్వంతో భారత మైత్రీ బంధం బలపడిన సంగతి తెలిసిందే. భారత్‌కు ఆఫ్ఘనిస్థాన్ కొత్త మిత్రదేశం కావడం, భారత కార్యకలాపాలు ఇక్కడ పెరగడం పాకిస్థాన్‌ను కలవరపెడుతోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి