ఎటువంటి ముప్పునైనా ఎదుర్కొంటాం: ఇరాన్

ఖండాతర క్షిపణి ప్రయోగం విజయవంతం కావడం ఇరాన్ మిలిటరీకి కొత్త ఉత్సాహం ఇస్తోంది. ఈ అధునాతన క్షిపణితో ఎటువంటి ముప్పునైనా తాము ఎదుర్కోగలమని ఇరాన్ మిలిటరీ ధీమా వ్యక్తం చేసింది. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకోవాలనుకునే ఎటువంటి ప్రదేశాన్నైనా (దేశాన్ని) తాము అందుకోగలమని హెచ్చరించింది.

ఇరాన్ తాజాగా పరీక్షించిన ఖండాతర క్షిపణి మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయేల్, యూరప్‌లోని కొన్ని ప్రాంతాలను అందుకోగలదు. రెండు రోజుల క్రితం ఇరాన్‌లో యుద్ధ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇరాన్ వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమంపై పశ్చిమ దేశాలు ఇప్పటికీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి.

ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తుండటం వాటిని మరింత రెచ్చగొట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ వారం ఐక్యరాజ్యసమితిలోని ఐదు శాశ్విత సభ్య దేశాలు, జర్మనీ వివాదాస్పద అణు కార్యక్రమంపై ఇరాన్‌తో సమావేశమవుతున్నాయి. ఈ సమావేశంలో ఇరాన్ నుంచి అణు కార్యక్రమంపై, రహస్యంగా నిర్మిస్తున్న రెండో అణు ప్లాంటుపై సూటి సమాధానాలు కోరే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి