పాకిస్థాన్కు అందించే సైన్యేతర ఆర్థిక సహాయాన్ని మూడింతలు వృద్ధి చేస్తూ రానున్న ఐదు సంవత్సరాలలో 7.5 వందల కోట్ల డాలర్లను అందించేందుకు అమెరికా కాంగ్రెస్ సంసిద్ధత వ్యక్తం చేసింది.
రానున్న ఐదు సంవత్సరాలలో తాము అందించాలనుకున్న ఆర్థిక సహాయంలో మూడింతలు వృద్ధి చేసి 7.5 వందల కోట్ల డాలర్లకు పెంచినట్లు అమెరికా కాంగ్రెస్ బుధవారం ప్రకటించింది. కాని తన సరిహద్దుల్లోనున్న పొరుగు దేశాలపై ఎలాంటి దాడులకు పాల్పడకూడదని కూడా ఆదేశాలు జారీ చేసింది.
ఒకవేళ పొరుగు దేశాలపై దాడులకు పాల్పడితే తాము అందించే సహాయం నిలిపివేస్తామని కూడా అమెరికా కాంగ్రెస్ సూచించినట్లు కాంగ్రెస్ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ అధ్యక్షుడు హావార్డ్ ఎల్ బెర్మన్ తెలిపారు.
పాకిస్థాన్ ప్రజలకు, ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకుగాను తాము ఈ ఆర్థిక సహాయం చేస్తున్నామని కాంగ్రెస్ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్లో పేర్కొంది. ముఖ్యంగా జైష్-ఏ- మొహమ్మద్, భారతదేశంలోని ముంబైపై దాడులకు పాల్పడ్డ లష్కర్-యే-తొయిబాలాంటి ఉగ్రవాద సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించాలని కూడా అమెరికా పాకిస్థాన్ను కోరింది.
పాక్ దేశానికి వచ్చే 2014 నాటికి ప్రతి యేడాది 1.5 వందల కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం అందించే విషయంపై గతవారం సెనేట్లో ఆమోదం తెలిపింది. దీంతోపాటు అమెరికా పాకిస్థాన్ దేశ ప్రజలతో కలిసి మెలిసి సామరస్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తుందని కూడా అమెరికా పేర్కొంది.
ఇదిలావుండగా పాకిస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులు మాటు వేసి వున్నారని, వీరు అమెరికాపై దాడులకు పూనుకునేందుకు తమ ప్రణాళికలను రచిస్తున్నట్లు అమెరికా తెలిపింది. కాగా అల్ఖైదా లాంటి తీవ్రవాదులను మట్టుబెట్టేందుకు పాకిస్థాన్ దేశానికి అమెరికా వెన్నుదన్నుగా వ్యవహరిస్తుందని బెర్మన్ అన్నారు.