బాగ్దాద్‌లో బాంబు పేలుళ్లు: 95 మంది మృతి

ఇరాక్‌లో ఉగ్రవాద మూకలు మరోసారి పంజా విసిరాయి. దేశ రాజధాని బాగ్దాద్‌లో తాజాగా ఉగ్రవాదులు సృష్టించిన రక్తపాతంలో 95 మంది మృతి చెందారు. ఇరాక్‌లో ఈ ఏడాది ఉగ్రవాదులు పెద్దఎత్తున హింసాకాండ సృష్టించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే పట్టణ ప్రాంతాల నుంచి అమెరికా దళాలు వెనక్కివెళ్లిన అనంతరం ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు.

పట్టణాల శాంతి భద్రతల బాధ్యతలను అమెరికా సైన్యం ఇటీవల ఇరాక్ భద్రతా యంత్రాంగానికి అప్పగించిన సంగతి తెలిసిందే. అనంతరం ఇరాక్ నగరాల్లో తరుచుగా బాంబు దాడులు జరుగుతున్నాయి. బాగ్దాద్‌లో బుధవారం వరుసగా సంభవించిన బాంబు పేలుళ్లలో 95 మంది మృతి చెందగా, 536 మంది గాయపడ్డారు.

ఈ వరుస పేలుళ్ల అనంతరం ఇరాకీ సేనల సామర్థ్యంపై ఆందోళన మరింత తీవ్రమైంది. షియా, సున్నీ వర్గపోరుకు కేంద్రంగా ఉన్న ఇరాక్‌లో ప్రభుత్వం షియా వర్గం నేతృత్వంలో నడుస్తోంది. తాజాగా బాగ్దాద్‌లో మంత్రులు కార్యాలయాలు, ఇతర లక్ష్యాల వద్ద ఆరు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దాడులకు సున్నీ తీవ్రవాదులే కారణమని ఇరాక్ అధికారిక యంత్రాంగం బలంగా అనుమానిస్తోంది.

వెబ్దునియా పై చదవండి