మయన్మార్ ప్రతిపక్ష నేత అంగ్ సాన్ సూకీని విడిచిపెట్టాలని ఆ దేశ మిలిటరీ జుంతాకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా విజ్ఞప్తి చేశారు. గృహ నిర్బంధంలో ఉన్న సూకీని కలుసుకొని నిర్బంధించబడిన అమెరికా పౌరుడిని ఇటీవల మయన్మార్ జుంతా విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. మయన్మార్ మిలిటరీ పాలకులు తమ పౌరుడిని విడిచిపెట్టడం పట్ల ఒబామా సంతోషం వ్యక్తం చేశారు.
అమెరికా పౌరుడి విడుదలపై మయన్మార్ జుంతాను అభినందించిన ఒబామా సోమవారం.. దేశంలో నిర్బంధించబడివున్న మిగిలిన రాజకీయ ఖైదీలను కూడా విడిచిపెట్టాలని మిలిటరీ నాయకత్వాన్ని కోరారు. మయన్మార్ పాలకులు గత 19 ఏళ్లుగా ప్రజాస్వామ్య నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అంగ్ సాన్ సూకీని నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే.
ఇందులో 14 ఏళ్లు ఆమె గృహ నిర్బంధంలో గడిపారు. ఆమెతోపాటు, మిగిలిన రాజకీయ ఖైదీలను విడిచిపెట్టాలని బరాక్ ఒబామా తాజాగా మరోసారి అమెరికా మిలిటరీ పాలకులకు విజ్ఞప్తి చేశారు. మయన్మార్ నేషనల్ లీగ్ ఆఫ్ డెమొక్రసీకి నేతృత్వం వహిస్తున్న సూకీకి ఇటీవల ఆ దేశ కోర్టు మరో 18 నెలల గృహ నిర్బంధాన్ని విధిస్తూ తీర్పు చెప్పింది. సూకీ గృహ నిర్బంధం నియమాలను ఉల్లంఘించి అమెరికా పౌరుడిని నివాసంలోకి అనుమతించినందుకు తాజాగా 18 నెలల గృహ నిర్బంధం విధించబడింది.