శ్రీలంకలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో ఎల్టీటీఈ, సైన్యం మధ్య ఇటీవల ముగిసిన యుద్ధం కారణంగా ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్న తమిళ పౌరులు తిరిగి స్వస్థలాలకు వెళుతున్నారు. ఈ ఏడాది మేలో ఎల్టీటీఈ, సైన్యం మధ్య యుద్ధం ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీలంకలో 30 ఏళ్లపాటు సాగిన పౌర యుద్ధానికి పూర్తిగా తెరపడింది.
శ్రీలంక సైన్యం దేశంలో ఎల్టీటీఈ ప్రాబల్యాన్ని తుడిచిపెట్టేందుకు చేపట్టిన తుది దశ పోరు కారణంగా వేలాది మంది తమిళ పౌరులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శరణార్థ శిబిరాలకు వెళ్లారు. వీరు తిరిగి స్వస్థలాలకు చేరుకునేందుకు శ్రీలంక ప్రభుత్వం గత కొన్నివారాలుగా ఏర్పాట్లు చేస్తోంది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో బుధవారం 1100 మంది తమిళ శరణార్థులను స్వస్థలాలకు పయనమయ్యారు. శరణార్థ శిబిరాల నుంచి తమిళ పౌరులు అధికారికంగా స్వస్థలాలకు తిరిగి వెళ్లడం ఇదే తొలిసారి. తొలి విడతలో బయలుదేరిన పౌరులు ట్రింకోమలే, అంపారా, బట్టికాలోవా, కంటాలే ప్రాంతాలకు చెందినవారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.