ధోనీ రికార్డునే బ్రేక్ చేసిన రిషబ్ పంత్

సోమవారం, 25 మార్చి 2019 (16:19 IST)
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా, ఆయన చేసిన రికార్డులు అనేకం. అటు కీపర్‌గా, ఇటు బ్యాట్స్‌మెన్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన అనేక రికార్డులను నమోదు చేస్తున్నాడు.
 
అయితే, ధోనీ చేసిన రికార్డుల్లో ఒక రికార్డును మాత్రం యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్రేక్ చేశాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం కాదు. స్వదేశంలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 12వ సీజన్‌‌లో ఈ రికార్డు బ్రేక్ అయింది. 
 
ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో రిషభ్‌ పంత్‌ హాఫ్ సెంచరీ చేశాడు. ముంబై బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 18 బంతుల్లోనే 50 రన్స్ రాబట్టాడు. దీంతో గతంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోనీ చేసిన వేగవంతమైన హాఫ్ సెంచరీ (20 బంతుల్లో) రికార్డును పంత్‌ అధిగమించాడు. ధోనీ 2012 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌‌పైనే వేగవంతమైన హాఫ్ సెంచరీ చేశాడు. 
 
ఇకపోతే, ఐపీఎల్‌లో వేగవంతమైన హాఫ్ సెంచరీని టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ నమోదు చేసాడు. 2018లో రాహుల్‌ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి మొదటి స్థానంలో ఉండగా, సునీల్‌ నరైన్‌, యూసుఫ్‌ పఠాన్‌లు సంయుక్తంగా రెండవ స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరు 15 బంతుల్లో 50 పరుగులు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు