కేఎల్ రాహుల్ ఆ మాట అనేశాడు.. స్టంప్‌మైక్‌లో రికార్డై పోయింది..! (video)

మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (16:25 IST)
KL Rahul
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. సాధారణంగా సన్నిహితంగా ఉండే ఆటగాళ్లు అప్పుడప్పుడు అసభ్య పదజాలంతో మాట్లాడుకోవడం మామూలే. అదీ ఒకే రాష్ట్రం, ఒకే భాష తెలిసిన ఆటగాళ్లైతే తమ స్థానిక భాషలో సరదాగా కొన్ని మాటలు అనుకుంటుంటారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లోనూ కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ సారథి కేఎల్‌ రాహుల్‌ ఎవరినో ఉద్దేశించి ఓ బూతు పదాన్ని వాడాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ట్విటర్లో చక్కర్లు కొడుతోంది. 
 
పంజాబ్‌ జట్టుకు ఈ సారి కేఎల్‌ రాహుల్‌ సారథ్యం వహిస్తున్నాడు. శ్రేయస్‌ సేనతో ఆ జట్టు తొలి మ్యాచ్‌ ఆడింది. రెండు జట్ల ఆటగాళ్లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. గెలుపు రెండు జట్లనూ దోబూచులాడింది. ఈ పోరులో పంజాబ్‌ తొలుత ఫీల్డింగ్‌ చేసింది. మహ్మద్‌ షమి విజృంభించడంతో ఢిల్లీని తక్కువ పరుగులకే కట్టడి చేసేలా కనిపించింది. 
 
అయితే ఫీల్డింగ్‌ తప్పిదాలు జరగడం, పరుగులు ఎక్కువగా వస్తుండటంతో రాహుల్‌ కాస్త దూకుడుగానే కనిపించాడు. తన జట్టులో ఎవరినో ఉద్దేశించి ఓ బూతు పదం ప్రయోగించాడు. బహుశా రాహుల్‌ కర్ణాటక ఆటగాళ్లను ఉద్దేశించే అంటాడని అనుకుంటున్నారు. మయాంక్‌ అగర్వాల్‌, కృష్ణప్ప గౌతమ్‌, కరుణ్‌ నాయర్‌ అదే రాష్ట్రానికి ఆడతారు. వీరంతా సన్నిహితంగా ఉంటారు. 
 
కాబట్టి వీరిలోనే ఎవరినో ఒకరిని అన్నాడని తెలుస్తోంది. నిజానికి అతడన్న మాట బయటకు వినిపించదు. స్టేడియంలో అభిమానులు లేకపోవడంతో స్టంప్‌మైక్‌లో రికార్డయ్యింది. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా రాహుల్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కెప్టెన్ అయి వుండి ఇలాంటి పదాలు వాడటం సబబు కాదంటున్నారు. ఇకపోతే.. గురువారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో పంజాబ్ రెండో మ్యాచ్‌లో తలపడనుంది.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు