కోల్‌కతాపై సూపర్ గెలుపు : డ్రెస్సింగ్ రూమ్‌లో బెంగుళూరు జట్టు ఎంజాయ్

మంగళవారం, 13 అక్టోబరు 2020 (13:33 IST)
యూఏఈ గడ్డపై జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల్లో భాగంగా సోమవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయభేరీ మోగించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, బ్యాట్స్‌మెన్ డివిలియర్స్ అద్భుత ఆట తీరుతో తమ జట్టును గెలిపించుకున్నారు.
 
ఈ మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు హాయిగా పలకరించుకున్న సమయంలో తీసిన వీడియోను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 
 
కోహ్లీ, డివిలియర్స్‌తో పాటు దాదాపు అందరు అందరూ ఆటగాళ్లు ఒకరినొకరు కరచాలనం చేసుకుంటూ, షాంపేన్ తాగుతూ సరదగా గడిపారు. అనంతరం మ్యాచ్‌పై తమ అభిప్రాయాలను తెలిపారు. 
 
కాగా, శనివారం జరిగిన మ్యాచ్‌ వివరాలను పరిశీలిస్తే, తొలుత టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టుకు ఫించ్, పడిక్కల్ శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించారు. 37 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 47 పరుగులు చేసిన ఫించ్.. ప్రసిధ్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. 
 
94 పరుగుల వద్ద పడిక్కల్ (32) కూడా అవుటయ్యాక డివిలియర్స్ క్రీజులోకి వచ్చాడు. కోహ్లీ సహకారం పూర్తిగా లభించడంతో డివిలియర్స్ చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. బౌలర్ ఎవరైనా బంతిని స్టాండ్స్‌లోకి పంపడమే లక్ష్యంగా పెట్టుకున్న మిస్టర్ 360 వీరవిహారం చేయడంతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది.
 
ఏబీడీ కొట్టిన ఓ బంతి స్టేడియం దాటి రోడ్డుకు ఆవల పడటం అతడి పవర్ హిట్టింగ్‌కు ఉదాహరణ. డివిలియర్స్ దంచుతుంటే కోహ్లీ మాత్రం నిదానంగా బ్యాటింగ్ చేశాడు. 33 బంతులు ఆడిన ఏబీడీ 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 73 పరుగులు చేయగా, కోహ్లీ 28 బంతుల్లో ఒకే ఒక్క ఫోర్‌తో 33 పరుగులు చేశాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోరు చేసింది.
 
ఆ తర్వాత 195 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు లక్ష్య ఛేదనలో కోల్‌కతా తడబడింది. బెంగళూరు బౌలర్ల ముందు నిలవలేక 112 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా 82 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.
 
కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్‌కు 23 పరుగుల వద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టులోకి వచ్చిన కొత్త కుర్రాడు టామ్ బాంటమ్ (8) నవదీప్ సైనీ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అప్పుడు మొదలైన వికెట్ల పతనం 19వ ఓవర్ వరకు కొనసాగింది. 
 
జట్టును ఆదుకుంటారనుకున్న శుభ్‌మన్ గిల్ (34), నితీశ్ రాణా (9), ఇయాన్ మోర్గాన్ (8) మరో మారు నిరాశపరచగా, కెప్టెన్ దినేశ్ కార్తీక్ (1) పేలవ ఫామ్ కొనసాగుతోంది. 64 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన కేకేఆర్ పరాజయం అప్పుడే ఖాయమైంది.
 
రసెల్ (16), రాహుల్ త్రిపాఠి (16) కూడా పెవిలియన్ చేరడంతో ఆర్‌సీబీ గెలుపు లాంఛనమే అయింది. కమిన్స్ (1), నాగర్‌కోటి (4), వరుణ్ చక్రవర్తి (7), ప్రసిధ్  (2) పరుగులు చేశారు. దీంతో కేకేఆర్ ఇన్నింగ్స్ 112/9 వద్ద ముగిసింది. బెంగళూరు బౌలర్లలో మోరిస్, సుందర్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా, సైనీ, సిరాజ్, చాహల్, ఉడానాలు చెరో వికెట్ తీసుకున్నారు.
 
ఇకపోతే, ఈ విజయంతో కోహ్లీ సేన 10 పాయింట్లతో మూడో స్థానానికి చేరగా, కోల్‌కతా 8 పాయింట్లతో ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన డివిలియర్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు