ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్: కేకేఆర్‌పై 22 రన్స్ తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం

గురువారం, 26 మే 2016 (12:13 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్లో భాగంగా కోల్‌కతాతో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 22 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. మరోసారి సన్ రైజర్స్‌ని గెలిపించడంలో యువరాజ్ సింగ్ తన సత్తా ఏంటో నిరూపించాడు. యువరాజ్ 30 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 44 పరుగులు సాధించడంతో సన్ రైజర్స్ సులభంగా గెలుపును నమోదు చేసుకుంది. అలాగే సన్ రైజర్స్ ఆటగాళ్లు వార్నర్ (28), హెన్రిక్స్ (31), దీపక్ (31) మెరుగ్గా రాణించడంతో జట్టు సునాయాసంగా విజయం సాధించింది. 
 
తదనంతరం 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల పతనానికి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. కేకేఆర్ ఆటగాళ్లలో మనిష్ పాండే 36 పరుగులు, గంభీర్ 28 పరుగు‌లు మాత్రమే రాణించారు. భువనేశ్వర్ 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకొని సన్ రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇకపోతే శుక్రవారం గుజరాత్ లయన్స్‌తో జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గెలిస్తేనే సన్ రైజర్స్ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇక కేకేఆర్ జట్టు ఒత్తిడి కారణంగా ఈ మ్యాచ్‌ను కోల్పోయింది. కానీ కాలికి శస్త్ర చికిత్స కారణంగా నెహ్రా మ్యాచ్‌కు దూరమైనా సన్ రైజర్స్ అదరగొట్టింది. 

వెబ్దునియా పై చదవండి