మహమ్మదీయులకు పవిత్ర మాసమైన రంజాన్ నెలలో చివరి పదిరోజులు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడుతున్నాయి. వీటిని "లైలతుల్ ఖదర్" అని పిలుస్తారు. ఈ చివరి పదిరోజుల్లో (లైలతుల్ ఖదర్) చేసే నమాజ్ గురించి ఆయిషా (రలి) ఇలా పేర్కొన్నారు.
రంజాన్ చివరి పదిరోజులు వచ్చిన సందర్భంలో ముహమ్మద్ ప్రవక్త (సఅస) అల్లా స్మరణలో లీనమవుతారు. రాత్రంతా నిద్రలేకుండా అల్లాను ప్రార్థించారు. అలాగే తన కుటుంబాన్ని కూడా నమాజ్లో అల్లాను ప్రార్థించాల్సిందిగా ఉద్భోదించారని చెప్పారు.
"లైలతుల్ ఖదర్" రాత్రుల్లో చేసే శుభ కార్యాలు వెయ్యి నెలలకు చేసే శుభ కార్యాలతో సమానమని ముహమ్మద్ ప్రవక్త (సఅస) అయిషా(రలి)తో పేర్కొన్నట్లు ఖురాన్ చెబుతోంది.
అంతేగాకుండా.. రంజాన్ నెలలో వచ్చే చివరి పది రోజులు రాత్రుల్లో అల్లాను భక్తి శ్రద్ధలతో, విశ్వాసంతో మసీదులో జరిగే ప్రార్థనలో పాల్గొనే భక్తులు.. తమ పాపాల నుంచి విముక్తులవుతారని ఇస్లాం మత పెద్దలంటున్నారు.
అందుచేత రంజాన్ చివరి పదిరోజులు అల్లాను నిష్టతో ప్రార్థించాలని ఖురాన్ చెపుతోంది. దీనినే బడీ రాత్ అని కూడా అంటారు. ఈ బడీ రాత్ రోజున చిన్న-పెద్ద, ముసలి- ముతక రాత్రిళ్ళు అల్లాను స్మరిస్తూ...జాగారణ చేస్తుంటారు. ఈ జాగరణలోనే ఖురాన్ పఠనం గావిస్తుంటారు.