కొత్త ప్రైవసీ విధానం.. వెనక్కి తగ్గిన వాట్సాప్.. 3 నెలల తర్వాతే..?

శనివారం, 16 జనవరి 2021 (09:13 IST)
వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానంపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. ప్రస్తుతానికి మూడు నెలల పాటు అప్‌డేట్‌ను వాయిదా వేయనున్నట్లు ప్రకటించింది. వ్యక్తిగత సమాచార గోప్యతపై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొత్త విధానం ఫిబ్రవరి 8 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా.. తాజా నిర్ణయంతో అది మరికొంత కాలం నిలిచిపోనుందని తెలిపింది. మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో డేటా షేరింగ్‌పై ఇటీవల వినియోగదారులు అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
 
కొత్త ప్రైవసీ విధానంలో వ్యక్తిగత సంభాషణలు సహా ప్రొఫైల్‌ సంబంధిత ఇతర వివరాలేవీ ఫేస్‌బుక్‌తో పంచుకోవడం ఉండదని వాట్సాప్ స్పష్టం చేసింది. ఈ అప్‌డేట్‌ కేవలం బిజినెస్‌ చాట్స్‌లో వినియోగదారులు వాట్సాప్‌ ద్వారా కంపెనీ కస్టమర్‌ కేర్‌తో మాట్లాడడానికి సంబంధించింది మాత్రమేనని వివరించింది. కేవలం బిజినెస్‌ ఫీచర్స్‌ను మరింత మెరుగ్గా యూజర్లకు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది.
 
వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని వాట్సాప్‌గానీ, ఫేస్‌బుక్‌గానీ చూసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. లోకేషన్‌ షేరింగ్‌ను కూడా చూడలేమని తెలిపింది. ఫిబ్రవరి 8న ఏ ఒక్కరి ఖాతా రద్దు కాదని స్పష్టం చేసింది. ఈ మూడు నెలల కాలాన్ని ప్రజల్లో ఉన్న అపోహల్ని తొలగించేందుకు వినియోగించుకుంటామని తెలిపింది. వినియోగదారులు కొత్త విధానాన్ని క్రమంగా అర్థం చేసుకొని అంగీకరించిన తర్వాతే అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు