కరోనా పుట్టినిల్లు చైనాకు షాక్.. భారత్‌ వైపు ఆపిల్ చూపు..!

సోమవారం, 11 మే 2020 (16:11 IST)
కరోనా పుట్టినిల్లు చైనాపై ఇప్పటికే ప్రపంచ దేశాలు గుర్రుగా వున్నాయి. ఆహారంలో గబ్బిలాలు వంటి ఇతరత్రా వాటిని తీసుకుని కరోనా లాంటి వైరస్‌ పుట్టేందుకు కారణమైన చైనాపై ప్రపంచ దేశాలు ఫైర్ అవుతున్నాయి. ముఖ్యంగా చైనాపై అమెరికా గుర్రు వుందనేందుకు పలు సందర్భాల్లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లే నిదర్శనం. 
 
ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సంస్థ భారత దేశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. తన ఉత్పత్తి సామర్థ్యంలో దాదాపు ఐదో వంతు చైనా నుండి భారతదేశానికి తరలించాలని యోచిస్తోందని నివేదికల ద్వారా తెలుస్తోంది.
 
దేశంలో స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన భారత ప్రభుత్వ కొత్త ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ) పథకం ద్వారా ప్రయోజనాలను పొందాలని కంపెనీ ఆపిల్‌ భావిస్తోందట.
 
ఈ మేరకు గత కొన్ని నెలలుగా ఇందుకు సంబంధించిన పనులు తెరవెనుక జరుగుతున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే, ఐఫోన్ తయారీదారు భారతదేశపు అతిపెద్ద ఎగుమతిదారుగా మారవచ్చని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. గత ఏడాది చివర్లో భారత ప్రభుత్వం స్థానిక సోర్సింగ్ నిబంధనలపై ఇచ్చిన సడలింపులపై ఆపిల్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. 
 
ప్రస్తుతం, ఆపిల్ తన స్మార్ట్‌ఫోన్‌లు ఇతర ఉత్పత్తుల ఉత్పత్తి కోసం తయారీదారులైన ఫాక్స్‌ కాన్, విస్ట్రాన్‌లను ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కాంట్రాక్టర్ల ద్వారానే భారతదేశంలో 40 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌లను ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది.  
 
ఆపిల్ ప్రస్తుతం భారతదేశంలో రీసెల్లర్స్‌ ద్వారా మాత్రమే తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఇటీవల దేశంలో రిటైల్ ప్రయత్నాలను వేగవంతం చేస్తోందన్న అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. 2021లో దేశంలో మొట్టమొదటి ఆపిల్ రిటైల్ స్టోర్‌ను ప్రారంభించాలని భావిస్తున్నట్టు ఫిబ్రవరిలో పెట్టుబడిదారు సమావేశంలో ఆపిల్‌ సీఈవో టిమ్ కుక్ ప్రకటించడం ఈ వార్తలకు బలాన్నిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు