రిలయన్స్ జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. 2017 మార్చి వరకు ఉచిత సేవలు!?

సోమవారం, 24 అక్టోబరు 2016 (16:14 IST)
రిలయన్స్ జియో కస్టమర్లకు దీపావళి కానుకను ఇచ్చే ఉద్దేశ్యంలో ఆ సంస్థ యాజమాన్యం ఉంది. ఇప్పటికే వెల్‌‌కమ్ ఆఫర్ కింద డిసెంబర్ 3వ తేదీ వరకు ఉచిత సేవలను అందించనుంది. ప్రస్తుతం ఈ ఆఫర్ కింద ఫ్రీ వాయిస్ కాల్స్, 4జీ డేటా ఆఫర్‌ ఇస్తోంది. అయితే, ట్రాయ్ నిబంధనల మేరకు వెల్‌కమ్ ఆఫర్ కింద ఏ టెలికాం ఆపరేటర్ కూడా 90 రోజులకు మించి ఉచిత సేవలను అందించడానికి వీల్లేదు. ఈ కారణంగానే, ఉచిత సేవలను డిసెంబర్ 3 వరకు ఇస్తున్నట్టు జియో గతంలో ప్రకటించింది. 
 
కానీ, వినియోగదారులకు ఇచ్చిన హామీ మేరకు సేవలను అందించలేని పక్షంలో, వారి నుంచి ఛార్జీలను వసూలు చేయడం కూడా న్యాయవిరుద్ధమే అనే కోణంలో ఉచిత సేవల కటాఫ్ తేదీని మరో మూడు నెలల పాటు పెంచేందుకు జియో సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇంటర్ కనెక్షన్ సమస్యలతో తమ కస్టమర్లు నాణ్యమైన సేవలను పొందలేకపోతున్నారని గుర్తు చేశారు. 
 
దీంతో తాము ఇవ్వాలనుకున్న సేవలను కస్టమర్లు పూర్తి స్థాయిలో పొందలేక పోతున్నారనీ అందువల్ల మరో మూడు నెలల పాటు ఈ సేవలను పొడగించాలని భావిస్తున్నట్టు ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. పైగా, డిసెంబర్ తర్వాత కూడా ఉచిత సేవలను కొనసాగించడానికి తమకు ట్రాయ్ అనుమతి కూడా అవసరం లేదని చెప్పారు. దీంతో, 2017 మార్చ్ వరకు జియో ఉచిత సేవలు అందుబాటులోకి రానున్నాయి.

వెబ్దునియా పై చదవండి