భారత్ ఆదేశాలు చట్ట విరుద్ధం : ట్విట్టర్ సంచలన కామెంట్స్

బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (17:27 IST)
వివాదాస్పదంగా ఉన్న మొత్తం 1,178 ఖాతాలను తక్షణం ఆపివేయాలని, లేకుంటే అరెస్టు తప్పదని ట్విట్టర్‌ యాజమాన్యాన్ని కేంద్రం హెచ్చరించింది. దీనికి ట్విట్టర్ కూడా ధీటుగానే సమాధానమిచ్చింది. భారత ప్రభుత్వం నుంచి తమకు అందిన ఆదేశాలు చట్ట విరుద్ధమని, ఈ ఖాతాలను భారత్‌లో మాత్రమే నిషేధించామని, మిగతా దేశాల్లో అందుబాటులోనే ఉంటాయని తన బ్లాగ్ పోస్టులో సంచలన వ్యాఖ్యలు చేసింది. 

పైగా, చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న ఈ ఆదేశాలను పూర్తిగా పాటించలేమని, వీటిని పూర్తిగా నిలిపివేయడం లేదని స్పష్టం చేసింది. ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ సొంతమేనని, వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛగా భావాలను వ్యక్తీకరించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని వ్యాఖ్యానించిన ట్విట్టర్, ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇదే విధమైన పరిస్థితి నెలకొని వుందని గుర్తుచేసింది. 

'మాకు అందిన ఆదేశాలు భారత న్యాయ వ్యవస్థకు, చట్టాలకు అనుగుణంగా లేవని మేము భావిస్తున్నాము. ఈ ఖాతాలపై మేము పూర్తి చర్యలు తీసుకోలేము. వీటిల్లో మీడియా సంస్థలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కార్యకర్తల ఖాతాలు కూడా ఉన్నాయి. వీటిని నిషేధిస్తే, భారత రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యపు హక్కును హరించినట్టే. అది వారి ప్రాథమిక హక్కులో ఒకటన్నదే మా ఉద్దేశం' అని ట్విట్టర్ పేర్కొంది. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు