ఐటీ పరిశ్రమలో ఉద్యోగాల కోత లేదు: మూర్తి

ఆదివారం, 2 నవంబరు 2008 (05:10 IST)
భారతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ ఆర్థిక పతనం, ద్రవ్య సంక్షోభం తీవ్రస్థాయిలో అలుముకుంటున్నప్పటికీ దేశీయ ఐటి పరిశ్రమలో ఉద్యోగాలపై కోత విధించే ప్రశ్నేలేదని ఇన్పోసిస్ టెక్నాలజీస్ సంస్థాపకుడైన ఎన్ఆర్ నారాయణ మూర్తి స్పష్టం చేశారు. భారతీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థల్లో అగ్రగామి అయిన సంస్థ సంస్థాపకుడు నారాయణ మూర్తి దేశీయ ఐటి పరిశ్రమ పునాదులు చెక్కు చెదరలేదని చెప్పారు.

అయితే ఈ సంవత్సరం దేశీయ ఐటీ పరిశ్రమ వృద్ధి కాస్త మందగించిందని, అయినప్పటికీ ఇది భారతీయులపై పెద్దగా ప్రభావం చూపబోదని నారాయణ మూర్తి పేర్కొన్నారు. ఐటీ రంగంలో ఉపాధి కల్పన నికర పెరుగుదల రేటు ఇప్పటికీ సానుకూలదిశలోనే సాగుతోందని మూర్తి చెప్పారు.

ఖర్చు తగ్గించుకునే పథకంలో భాగంగా కొన్ని ఐటి కంపెనీలు సిబ్బందిని కుదించుకుంటున్నప్పటికీ కొత్త ఉద్యోగుల కోసం వారు ప్రకటనలు వెలువరిస్తూనే ఉన్నారని చెప్పారు. ద్రవ్యోల్బణం, అమెరికా సంక్షోభపు మానసిక ప్రభావం అనేవి ఈ కష్టకాలంలో భారతీయ పరిశ్రమపై కీలకమైన సవాళ్లను విసురుతున్నాయని, ఇవే కొన్ని కంపెనీలు కలవరపాటుకు గురయ్యేలా చేస్తున్నాయని నారాయణ మూర్తి వివరించారు.

ప్రపంచ ఆర్థిక పతనంలో భాగంగా డాలర్ మారక రూపాయి విలువ పడిపోతున్నప్పటికీ ఐటి పరిశ్రమకు ఇది ప్రయోజనకరంగానే ఉందని మూర్తి చెప్పారు. డాలర్ మారక రూపాయి విలువ తగ్గిపోవడం కారణంగా ఐటీ పరిశ్రమకు అధికాదాయం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని మూర్తి పేర్కొన్నారు. రూపాయి బలహీనపడటం అనేది భారతీయ ఐటి పరిశ్రమ ఉత్పత్తులను ఇతర దేశాల ఐటి వ్యాపారంతో పోలిస్తే ముందంజలో ఉంచుతోందని మూర్తి అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి