మొబైల్ బ్యాంక్ అంటే...సాంకేతికంగా నేడు అభివృద్ధి జరుగుతున్న తరుణంలో ప్రతిదీ మన ముంగిటకే వస్తున్నాయి. అలాగే ఇప్పుడు బ్యాంక్ లావాదేవీల్లో కూడా విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఇంటర్నెట్, మొబైల్ల ద్వారా బ్యాంక్ సేవలను వినియోగించుకునే వెసలుబాటు కలుగుతోంది. మనం ఎక్కడ ఉంటే అక్కడినుంచే మొబైల్ ఫోన్ ద్వారా కేవలం ఒక్క ఎస్ఎంఎస్ పంపిస్తే మనకు కావాల్సిన సేవలపై బ్యాంకు ఆదేశాలు ఇవ్వడమే మొబైల్ బ్యాంకింగ్. ఈ మొబైల్ బ్యాంకింగ్ మూడు రకాలుగా పనిచేస్తుంది. 1. ఎస్ఎంఎస్, 2. వాప్, 3. యుఎస్ఎస్డి. ఈ సేవలు ఎలా పనిచేస్తాయంటే...
1. ఎస్ఎంఎస్:- కస్టమర్ తన బ్యాంకుకు ఏ లావాదేవీ నిర్వహించాలనుకుంటే దానికి అనుగుణంగా ఎస్ఎంఎస్ పంపాలి. ఇలా ఎస్ఎంఎస్ పంపడానికి బ్యాంకు ఒక ప్రత్యేక నెంబరు తన ఖాతాదారునికిస్తుంది. ఆ నెంబరుకు మాత్రమే ఎస్ఎంఎస్ పంపాల్సివుంటుంది. మీరు పంపే ఎస్ఎంఎస్ టెక్స్ట్ మెసేజ్ రూపంలోనే పంపాలి.
మీ మొబైల్ ద్వారా పంపిన ఎస్ఎంఎస్ మొదట సర్వీస్ ప్రొవైడర్కు చెందిన ఎస్ఎంఎస్ కేంద్రానికి చేరి తద్వారా బ్యాంకుకు చేరుతుంది. అలా మీరు పంపిన ఎస్ఎంఎస్ ద్వారా అందుకున్న విజ్ఞప్తిని బ్యాంకు స్వీకరించి మీ లావాదేవీని ఆమోదించినట్లు మీకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తుంది. ఇదంతా కేవలం కొన్ని క్షణాలలోనే జరిగిపోతుంది.
2. వాప్:- ఈ విధానంలో లావాదేవీలకు వాప్/జిపిఆర్ఎస్ టెక్నాలజీతో పనిచేసే మొబైల్ సెట్లు అవసరం. సెల్యూలార్ సర్వీస్ ప్రొవైడర్ కస్టమర్ మొబైల్లో వాప్/జిపిఆర్ఎస్ ఇన్స్టాల్ చేస్తాడు. ఖాతాదారుడు ఆ వాప్ సైట్ లోకి లాగిన్ అవ్వాలి.
బ్యాంకు కూడా వాప్/జిపిఆర్ఎస్ లావాదేవీలు నిర్వహించేందుకు వీలు కల్పించే సాఫ్ట్వేర్ను వాప్ సైట్ ద్వారానే పంపుతుంది. దాన్ని ఖాతాదారుడు తన మొబైల్ హ్కాండ్ సెట్లో పొందుపరచుకోవాలి.
ఆతర్వాత దానికి సంబంధించిన ఐకాన్ హ్యాండ్సెట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ తర్వాత కస్టమర్ ఐడి, నెట్ బ్యాంకింగ్ పిన్ టైప్ చేస్తే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మెనూ వస్తుంది.
బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, చెక్బుక్ రిక్వెస్ట్ వంటి భిన్న సేవల్లో తాను ఏ సేవ పొందాలనుకుంటున్నది తెలియజేసి మీ లావాదేవీ వివరాలు అందిస్తేచాలు క్షణాల్లో మీ రిక్వెస్ట్ ప్రాసెస్ అవుతుంది. ఈ విధానంలో కూడా వరుగా మూడుసార్లు మీ పిన్ టైప్ చేయకూడదు.
3. యుఎస్ఎస్డిల (అన్ స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డివైస్) :- దీనికి సాధారణ జిఎస్ఎం మొబైల్ హ్యాండ్సెట్ ఉంటే చాలు. బ్యాంకు ఖాతాదారునికి ఒక పిన్ నెంబరుతోబాటు యుఎస్ఎస్డి సదుపాయం ఉపయోగించుకోవడానికి ఒక ప్రత్యేక నెంబరు కూడా ఇస్తుంది.
ఈ విధానంలో మొబైల్ వినియోగదారుడు ఎలాంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మొబైల్ ఆధారిత టెక్స్ట్ మెనూ ద్వారా మీకు అందుబాటులో ఉండే సేవలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.
మీరు చేయవలసిన లావాదేవీ ఎంపిక చేసుకుని మీ పిన్ నెంబరు తెలియజేసి మీ లావాదేవీ వివరాలు తెలిపితే క్షణాల్లో అది పూర్తవుతుంది.
4. మొబైల్ బ్యాంకింగ్లో మీ పేరు ఎలా నమోదు చేసుకోవాలి... * మొబైల్ బ్యాంకింగ్ సదుపాయం పొందాలనుకునే వారు ఆ సదుపాయం అందిస్తున్న ఏదైనా ఒక బ్యాంకులో ఖాతాదారులైవుండాలి.
* దేశంలోని మొబైల్ సర్వీసులు అందిస్తున్న సంస్థల్లో ఏదో ఒక సంస్థ చందాదారులై ఉండాలి. ఆ మొబైల్ సంస్థకు, బ్యాంకుకు మధ్య మొబైల్ బ్యాంకింగ్ సేవలందించే విషయంలో భాగస్వామ్య ఒప్పందం కలిగివుండాలి. మీ మొబైల్ నెంబరును బ్యాంక్కు తెలియజేయాలి.
* మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందాలనుకునే వారు సంబంధిత బ్యాంకులో నిర్దిష్ట దరఖాస్తు ఫారం పూర్తి చేయడం ద్వారా ఆ సేవలను తమకు విస్తరింపజేయాలంటూ బ్యాంకును అభ్కర్ధించాలి.
ఏ ఖాతా ద్వారా మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుకోవాలనుకుంటున్నారో ఆ ఖాతాను మీ ఖాతా ఐడీని అనుసంధానం చేయాలి. ఒక ఖాతాదారుడు ఒకే ఐడీతో గరిష్టంగా అయిదు ఖాతాలతో అనుసంధానం కావచ్చు.
* సంబంధిత బ్యాంకు మీకు మొబైల్ బ్యాంకింగ్ పిన్ ఇస్తుంది. ఆ పిన్ ఆధారంగా లావాదేవీలు నిర్వహించుకోవాలి. మీకు ఇచ్చిన పిన్ నెంబరు చాలా జాగ్రత్తగా టైప్ చేయాలి. పొరపాటున తప్పుడు నెంబరు టైప్ చేయకూడదు. ఒకవేళ పొరపాటున టైప్ చేసినా మూడుసార్లు వరుసగా తప్పుడు నెంబరు టైప్ చేస్తే ఖాతా స్తంభించిపోతింది.
**ఎలాంటి సేవలు పొందవచ్చు 1. ఖాతాలోని బ్యాలెన్స్ వివరాలు. 2. గతంలో చేసిన మూడు లావాదావీల వివరాలు. 3. చెక్ బుక్ అభ్యర్ధన, 4. చెక్ పేమెంట్ నిలిపివేతకు ఆదేశం జారీచేసే అవకాశంవుంది, 5. ఫిక్స్డ్ డిపాజిట్ వివరాలు, 6. విద్యుత్, మొబైల్ ఫోన్, బేసిక్ ఫోన్ బిల్లుల చెల్లింపులు తదితర సేవలను వినియోగించుకోవచ్చని బ్యాంకు ఉన్నతాధికారులు తెలిపారు.