ప్రపంచంలో మరేదేశంలో లేనివిధంగా చైనాలో ఎక్కువమంది ఇంటర్నెట్ వాడుతూ రికార్డు సృష్టించారు. దీనితో అత్యధిక నెటిజన్లు ఉన్న రికార్డు చైనా కైవసం అయింది. భారత్కు పొరుగుదేశమైన చైనాలో 25.3కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. వీరందరూ క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవడం గమనార్హం.
చైనాలో ఎక్కువమంది నెటిజన్లు ఉన్నారని చైనా ఇంటర్నెట్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (సీఎన్ఎన్ఐసీ) తెలిపింది. 2008 ఆరంభంలోనే ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యలో అమెరికాను చైనా అధిగమించింది. 2007 డిసెంబరు 31వ తేదీ నాటి గణాంకాల ప్రకారం అమెరికాలో 21.8 కోట్ల మంది నెటిజన్లు ఉండగా, చైనాలో 21కోట్ల మంది ఉన్నారు.
చైనాకు చెందిన సీఎన్ఎన్ఐసీ గణాంకాల మేరకు జూన్ నాటికి స్థానిక నెటిజన్ల సంఖ్య 23 కోట్లుగా ఉందని వివరించింది. చైనాలో ఇంటర్నెట్ సేవలు అన్ని ప్రాంతాలకు విస్తరించలేదని సీఎన్ఎన్ఐసీ ప్రతినిధి ఒకరు అన్నారు. చైనా ఉన్నత పాఠశాల్లో విద్యార్ధులు ఎక్కువగా నెట్ వాడకం చేస్తుండటం గమనార్హం.
చైనా విద్యా రంగంలో ఇంటర్నెట్ వాడకం అధికంగా ఉంది. ప్రస్తుత ఏడాది తొలి ఆరునెలల కాలంలో ఈ వృద్ధి 56 శాతంగా ఉంది. కొత్త నెటిజన్ల సంఖ్య 4.3 కోట్లు కాగా, అందులో 3.9 కోట్లమంది పాఠశాలల విద్యార్ధులు. చైనా ప్రజల్లో 30 సంవత్సరాల లోపు వయస్సు గల వారిలో 69 శాతం మంది నెటిజన్లుగా కొనసాగుతున్నారు.
ఆసియా ఖండంలో జనాభా, వైశాల్యం పరంగా చైనా అతిపెద్ద దేశం. 21.4కోట్ల మంది జనాభా ఉన్న జనాభాలో 85 శాతం మంది ప్రజలు ఇంటర్నెట్ సేవలను వినియోగించుకుంటున్నారు. నెట్ నుంచి సంగీతం వినటం, పాటలను డౌన్లోడ్ చేసుకోవటం, మొబైల్ ఫోన్లలోకి రింగ్టోన్లు మార్చుకోవడం వంటి పనులు చైనా వాసులు విరివిగా చేస్తున్నారు.