రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యం.. అద్వానీలా నిష్క్రమించను : దేవెగౌడ

శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (16:04 IST)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తన లక్ష్యమని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. 85 ఏళ్ల వయస్సులోనూ ఆయన కర్ణాటక తూముకూర పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఆమోదం ఉంటే.. ఏకగ్రీవ అభ్యర్థిగా దేవెగౌడ మళ్లీ ప్రధానమంత్రి అవుతారని ఆయన తనయుడు కుమారస్వామి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని దేవెగౌడ గతంలో ప్రకటించారు. కానీ, ఈ ఎన్నికల్లో ఆయన తుముకూరు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇదే ఇపుడు సరికొత్త చర్చకు దారితీస్తోంది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మాట్లాడుతూ, గతంలోనే ఎన్నికల నుంచి తప్పుకొంటానని ప్రకటించినా.. మళ్లీ పరిస్థితులు తనను పోటీ చేసేలా పురికొల్పాయన్నారు. ప్రస్తుతానికి తనకు ఎలాంటి రాజకీయ ఆశయాలు, ఆశలు లేవని తెలిపారు. బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీలా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే ఉద్దేశం కూడా తనకు లేదని, తుదిశ్వాస ఉన్నంత వరకు పార్టీకి, ఈ దేశ ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. 
 
ఏకగ్రీవ అభ్యర్థిగా దేవెగౌడ మళ్లీ ప్రధానమంత్రి అయ్యే అవకాశముందని ఆయన తనయుడు, కర్ణాటక సీఎం హెచ్‌డీ దేవెగౌడ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. 'ఆ విషయం గురించి నేనేమీ ఆలోచించడం లేదు. నా బాధంతా మోడీ మళ్లీ పార్లమెంటులో అడుగుపెడతారనే.. ప్రధాని ముఖం ముందే అడిగే దమ్మూ, ధైర్యం నాకున్నాయి' అని దేవెగౌడ పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అయితే.. ఆయనకు అండగా నిలబడతానన్నారు.
 
ప్రధాని కావాలన్న ఉద్దేశ్యం తనకు లేదని, రాహుల్‌ను ప్రధాని చేయడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. కాగా, ఈ ఎన్నికల్లో దేవెగౌడతో పాటు.. ఆయన మనవడు, సీఎం కుమార స్వామి తనయుడు కూడా మాండ్యా లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉన్న విషయం తెల్సిందే. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి పోటీ చేస్తోంది. ప్రస్తుతం ఈ రెండు పార్టీలో పాలన సాగిస్తున్న విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు