280 మార్కును చేరడం కష్టమే.. మోదీ మళ్లీ ప్రధాని ఐతే సంతోషమే: శివసేన

మంగళవారం, 7 మే 2019 (18:51 IST)
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపి 271 నియోజక వర్గాల్లో విజయం సాధిస్తే.. చాలా సంతోషిస్తామని.. లేని పక్షంలో ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని రామ్ మాధవ్ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందించారు. 
 
2014 ఎన్నికల్లో బీజేపీ 280 సీట్ల మార్కుకు చేరుకుంది. కానీ ప్రస్తుతం ఆ మార్కును బీజేపీ చేరుకోవడం కాస్త కష్టతరమేనని సంజయ్ రౌత్ తెలిపారు. రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తానని.. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడటం సంతోషమే. కానీ దేశంలోనే ఏకైక అతిపెద్ద బీజేపీ ప్రస్తుతం 280-282 ఫిగర్‌ను చేరుకోవడం కష్టతరమేనని సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. 
 
అయినా మిత్రపక్షాలతో చేతులు కలిపి నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాన మంత్రి పగ్గాలు చేపట్టడంపై శివసేన హర్షం వ్యక్తం చేస్తోందన్నారు. శివ మాధవ్ వ్యాఖ్యల్లో నిజం వుందని.. శివసేన కూడా ఎన్డీయేలో భాగమని మాధవ్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తానని చెప్పుకొచ్చారు. ఇలా మిత్ర పక్షాలతో ఎన్డీయే కలిసి ముందుకెళ్తే.. ఈ క్రమంలో మోదీ ప్రధాని అయితే సంతోషిస్తామని సంజయ్ రౌత్ మీడియాతో వెల్లడించారు. 
 
కాగా ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీకి 18 మంది లోక్‌సభ సభ్యులున్న సంగతి తెలిసిందే. బీజేపీకి శివసేన ప్రధాన మిత్రపక్షం కావడం గమనార్హం. ఈ పార్టీ మహారాష్ట్రలోని బీజేపీ సర్కారులో భాగం కావడం విశేషం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు