దేశ రాజకీయాలపై తమిళ తంబి ఫలితాలు: ఏచూరీ

దేశ రాజకీయాలపై తమిళ ఓటర్లు ఇచ్చే తీర్పు పెను ప్రభావం చూపుతుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరీ అన్నారు. ఆయన తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏచూరీ మాట్లాడుతూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ రాష్ట్రానికి మాత్రమే సంబంధించినవి కావని, దేశ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయన్నారు.

కేంద్ర రాష్ట్రాల్లోని యూపీఏ, డీఎంకే సంకీర్ణ ప్రభుత్వాలు రాష్ట్రంలో అవినీతి, కుంభకోణాలలో భాగం పంచుకున్నాయన్నారు. యూపీఏ ప్రభుత్వం 2జి స్పెక్ట్రమ్‌, కామన్‌వెల్త్‌ క్రీడల నిర్వహణ, ఆదర్శ్‌ హౌసింగ్‌ సొసైటీ తదితర అవినీతి కుంభకోణాలతో పాలన సాగిస్తోందన్నారు. 2జి స్పెక్ట్రమ్‌లో కోల్పోయిన సొమ్ముతో దేశంలో విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేయవచ్చన్నారు.

ఆహారం లేక ప్రపంచవ్యాప్తంగా రోజుకు ఐదుగురు పిల్లలు మరణిస్తుండగా, వారిలో ముగ్గురు మన దేశంలోనే ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి కుంభకోణాల సొమ్ముతో వారికి ఒక పూట అన్నం పెట్టవచ్చన్నారు. ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదలు నిరుపేదలుగా మారుతున్నారని సీతారాం ఏచూరీ అన్నారు.

వెబ్దునియా పై చదవండి