చంపేసిన ఆధార్.. రేషన్ దొరక్క ప్రాణాలు కోల్పోయిన చిన్నారి

మంగళవారం, 17 అక్టోబరు 2017 (13:56 IST)
అంతర్జాతీయ ఆహార దినోత్సవాన్ని సోమవారం జరుపుకోవడం జరిగింది. అదేరోజున ఓ ఆకలి చావు కూడా నమోదైంది. ఆకలికేకలు తట్టుకోలేక ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన జార్ఖండ్‌లో సంభవించింది. ఇక్కడ విచిత్రమేమిటంటే ఆ ఆకలిచావుకు ఆధార్ కారణం కావడం గమనార్హం. 
 
రేషన్ కార్డుతో ఆధార్ నంబర్ అనుసంధానం చేయకపోవడంతో రేషన్ ఇవ్వలేదు. అలా 15 రోజులుగా పస్తులు ఉంటూ వచ్చిన ఆ చిన్నారి చివరకు సోమవారం ప్రాణాలు విడిచింది. ఒకవైపు సంక్షేమ పథకాలకు ఆధార్‌ నెంబరు అనుసంధానం తప్పనిసరికాదని సుప్రీం కోర్టు చెబుతుంటే.. మరోవైపు ప్రభుత్వం ఆధార్‌తో అనుసంధానించని వారిని సంక్షేమ పథకాలకు దూరం చేయడమే కాదు, వారి చావుకు కూడా కారణమవుతోంది. 
 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సిమ్దేగా జిల్లా కరిమతి అనే గ్రామంలో ఓ నిరుపేద కుటుంబం తన రేషన్‌ కార్డుకు ఆధార్‌ నెంబరును అనుసంధానం చేసుకోలేపోయింది. దీంతో ఆ కుటుంబానికి రేషన్ బియ్యం ఇచ్చేందుకు రేషన్‌ డీలరు నిరాకరించాడు. ఫలితంగా పక్షం రోజులుగా తినడానికి తిండి లేక ఆ కుటుంబ సభ్యులు ఆకలితో అలమటిస్తూ వచ్చారు. ఈ కుటుంబంలో 11 యేళ్ల సంతోషి కుమారికి పాఠశాలలో ఇచ్చే మధ్యాహ్న భోజనమే దిక్కైంది. పాఠశాలకు సెలవు ఉంటే అదీ అందని దుస్థితి. ఇటీవల వారం రోజులుగా భోజనానికి నోచుకోని సంతోషి ఆకలికి తట్టుకోలేక ప్రాణాలు విడిచింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు