చట్టాల్లో ప్రమాణాలు లేవు.. చర్చల్లో పల లేదు: జస్టిస్ ఎన్వీ రమణ

ఆదివారం, 15 ఆగస్టు 2021 (13:09 IST)
చట్టాల రూపకల్పనలో ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని, అసలు చట్టాలను తయారు చేసే ఉద్దేశమేంటో కూడా తెలియడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ  ఆవేదన వ్యక్తం చేశారు. 
 
సుప్రీంకోర్టులో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగిన తీరుపై తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. 
 
చట్టాలను సరిగ్గా తయారు చేయడం లేదని, వాటిపై సరైన చర్చలూ జరగడం లేదన్నారు. దేశంలో ఇది అత్యంత దారుణమైన విషయమన్నారు. నేటి ప్రభుత్వాలు చేస్తున్న చట్టాల్లో ఎన్నెన్నో లోపాలుంటున్నాయని, దాని వల్ల ప్రజలు, కోర్టులు, ఇతర భాగస్వాములకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. 
 
దేశ స్వాతంత్ర్యోద్యమం నుంచి దేశ తొలి చట్టసభ ప్రతినిధుల దాకా న్యాయవాదులు ఎనలేని కృషి చేశారన్నారు. ఆనాడు చట్టసభల్లో న్యాయవాదులు ఎక్కువగా ఉండేవారన్న ఆయన.. సభలో చర్చలు అర్థవంతంగా, నిర్మాణాత్మకంగా సాగేవని చెప్పారు. తీసుకురాబోయే చట్టాలపై సవివరాలతో చర్చ జరిగేదన్నారు.
 
అయితే, కాలం మారుతున్నా కొద్దీ అది మొత్తం మారిపోయిందన్నారు. చర్చల్లో పస ఉండడం లేదని, అసలు ఆ చట్టాల ఉద్దేశం కోర్టులకూ తెలియడం లేదని, వాటికి అభ్యంతరం చెప్పే అధికారమూ కోర్టులకు లేకుండా పోయిందని చెప్పారు. 
 
కాబట్టి ఇక నుంచి న్యాయవాదులంతా ఇళ్లకే పరిమితం కాకుండా ప్రజాసేవకూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ వంటి మహామహులు న్యాయవాదులేనని సీజేఐ రమణ గుర్తు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు