దారుణం... అతడి మొండెం జనగామలో... తల నాగ్ పూర్‌లో...

మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (16:52 IST)
రైలు మెట్ల మీద కూర్చుని ప్రయాణిస్తున్న వ్యక్తి జారిపడటంలో శరీరం రెండు ముక్కలయింది. మొండెం అక్కడే పడిపోగా తల మాత్రం మెట్లలో ఇరుక్కుని నాగ్‌పుర్ వరకూ వెళ్లింది. సికింద్రాబాద్‌ నుంచి నాగ్‌పుర్‌ వెళ్లే నాగపూర్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి  ప్రమాదవశాత్తు జనగామ-రఘునాథపల్లి రైల్యే స్టేషన్‌ల మధ్య ఆ వ్యక్తి జారిపడ్డాడు. 
 
ఆదివారం ఉదయం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా మొండెం మాత్రం నుజ్జునుజ్జు అయ్యి కనిపించింది తల ఎంత వెతికినా కనిపించలేదు. శరీర భాగాలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా గుర్తు తెలియని వ్యక్తి తల బోగీ మెట్లలో ఇరుక్కుని ఉండటాన్ని నాగ్‌పూర్ రైల్వే స్టేషన్ సిబ్బంది గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. 
 
రైలు ప్రయాణించిన మార్గాలలోని అన్ని రైల్వే పోలీస్‌స్టేషన్‌లను అప్రమత్తం చేసారు. అది రఘునాథపల్లి వద్ద జరిగిన సంఘటనలో మరణించిన వ్యక్తి తలేనని కాజీపేట పోలీసులు భావించి సమాచారం అందించారు. తలకు బనియన్ ముక్కలు అతుక్కుని ఉన్నాయి. ఆ ముక్కలు మొండానికి ఉన్న ఎరుపు బనియన్‌తో సరిపోలడంతో నాగ్‌పుర్‌లో దొరికిన తల ఆ వ్యక్తిదేనని నిర్ధారణకు వచ్చారు. 
 
తలను తెచ్చి అప్పగించే బాధ్యతను సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో పనిచేస్తున్న కాజీపేటకు చెందిన రైల్వే కానిస్టేబుల్‌కు ఇచ్చారు. సోమవారం తలను ఎంజీఎం ఆసుపత్రిలోని మొండెం వద్ద వుంచి పోస్ట్‌మార్టం నిర్వహించారు. వ్యక్తి 25 నుండి 30 ఏళ్ల మధ్య వయస్కుడని నిర్ధారించారు. కానీ మృతుని వివరాలు మాత్రం తెలియరాలేదు. ఇది హత్యా లేక ప్రమాదమా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు