ఆప్ మంత్రి సందీప్ కుమార్ రాసలీలలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇద్దరు మహిళలతో ఆప్ మంత్రి సందీప్ కుమార్ సాగించిన శృంగారం.. సీడీల రూపంలో సీఎం కేజ్రీవాల్కు అందడంతో.. సందీప్ మంత్రి పదవి ఊడిన సంగతి తెలిసిందే. తాను దళితుడినవడం వల్లే ఈ కుట్రంతా జరిగిందని సందీప్ కుమార్ ఆరోపిస్తుండగా.. సందీప్ కుమార్ అండగా మరో ఆమ్ ఆద్మీ నేత, ఆప్ అధికార ప్రతినిధి అశుతోష్ ఓ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో సందీప్ కుమార్ను అశుతోష్ వెనకేసుకొచ్చారు.
''శృంగారం ప్రాథమిక అవసరాల్లో ఒకటి. సందీప్ తప్పేముంది'' అంటూ విమర్శకులను తన బ్లాగ్లో ప్రశ్నించారు. "దేశ చరిత్రలో ఇలాంటి ప్రముఖులెందరు లేరు? పండిట్ నెహ్రూ-లేడీ మౌంట్బాటెన్ సంబంధం జగమెరిగిన సత్యం'' అంటూ అశుతోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రవీంద్రుడి దూరపు బంధువు సరళాచౌదరి తన ఆత్మిక సతీమణి అని గాంధీజీ అంగీకరించలేదా? అంటూ ప్రశ్నలు గుప్పించారు.
స్త్రీ పురుషులిద్దరి సమ్మతితో శృంగారానికి అభ్యంతర పెట్టాల్సిన అవసరం ఏముందని అడిగారు. సందీప్ కుమార్కు మద్దతుగా మాట్లాడుతూ అశుతోష్ భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, జాతి పిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని వాజ్ పేయ్, జార్జి ఫెర్నాండెజ్ తదితరుల వివాహేతర సంబంధాలను కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. అప్పట్లో వారి నెవరినీ తప్పుపట్టలేదని, ఇప్పుడు సందీప్ కుమార్ను ఎందుకు వేలెత్తి చూపుతున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు.