దోమలు కుట్టాయనీ భర్తను రోకలిబండతో చితకబాదిన భార్య

శుక్రవారం, 15 నవంబరు 2019 (11:12 IST)
రాత్రి పూట ఇంట్లో పడుకునివుండగా దోమలు కుట్టాయని భర్తను రోకలిబండతో చితకబాదిందో భార్య. ఈ దాడిలో భర్త తీవ్రంగా గాయపడ్డారు. పైగా, ఈ చర్యను ఆమె ఇద్దరు కుమార్తెలు సమర్థించారు కూడా. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ నగరంలోని నరోడా ప్రాంతంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నరోడా ప్రాంతానికి చెందిన భూపేంద్ర లెవువా గత కొన్ని మాసాలుగా కారులో ఎల్ఈడీలు బల్బులు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 
 
బల్బులు విక్రయించడం వల్ల వచ్చే ఆదాయంతోనే కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. అయితే, ఈ ఆదాయం సరిపోక పోవడంతో ఇంటి కరెంటు బిల్లుకూడా చెల్లించలేక పోయాడు. దీంతో విద్యుత్ సిబ్బంది ఇంటికి కరెంట్ కట్ చేశారు. 
 
ఈ కారణంగా చీకటి ఇంట్లోనే గడపాల్సి వచ్చింది. దీంతో ఇంట్లో దోమలు ఎక్కువై భార్యాపిల్లలు నిద్రపోవడం మానేశారు. పైగా, దోమలు కుడుతుండటంతో భరించలేకపోయారు. ఈ క్రమంలో రాత్రిపూట నిద్రిస్తున్న భర్తపై భార్య రోకలిబండతో మోది గాయపరిచింది. 
 
ఆ దెబ్బలకు అతని కుడి కంటికి కూడా గాయమైంది. దీనిపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు... విచారిస్తున్నారు. బాధితుడుని ఆస్పత్రికి తరలించగా, కంటి గాయానికి ఏడు కుట్లు వేసి చికిత్స చేస్తున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు