అర్ధరాత్రి హైడ్రామా. కోర్టు ఆదేశంతో టి.టి.వి. దినకరన్‌ అరెస్టు

బుధవారం, 26 ఏప్రియల్ 2017 (04:13 IST)
అన్నాడీఎంకే పార్టీ రెండాకుల గుర్తు కోసం ఏకంగా ఎన్నికల సంఘానికే లంచం ఇవ్వజూపిన కేసులో ఆ పార్టీ అమ్మ వర్గం ఉప ప్రధాన కార్యదర్శి, శశికళ మేనల్లుడు టి.టి.వి. దినకరన్‌ను డిల్లీ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఇప్పటికే ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నాలుగు రోజుల నుంచి ప్రశ్నిస్తున్నారు. తొలుత సుఖేశ్‌ చంద్రశేఖర్‌ ఎవరో తెలియదని చెప్పిన దినకరన్‌ తర్వాత అతను తెలుసు అని అంగీకరించాడు. ఈ కేసులో దినకరన్‌ సహాయకుడు మలిఖార్జునను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
 
ఢిల్లీ పోలీసులు దినకరన్ కోసం గాలిస్తున్నప్పటికీ అతడికి మల్లిఖార్జున్ ఆశ్రయమిచ్చాడనే ఆరోపణతో అతడిని కూడా అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం ఢిల్లీ కోర్టు శశికళ మేనల్లుడు దినకరన్‌పై ముడుపుల ఘటనకు గాను ఎందుకు చర్య తీసుకోలేదని పోలీసులను ప్రశ్నించింది. దీంతో అనివార్యంగా దినకరన్‌ని పోలీసులు అరెస్టు చేయవలసి వచ్చిందని తెలుస్తోంది. 
 
చెన్నయ్‌లో ఇప్పటికే తిరుగుబాటును ఎదుర్కొంటున్న దినకరన్‌కు ఈ అరెస్టుతో అన్ని దారులూ మూసుకుపోయినట్లే. శశికళ వర్గం ఈ మధ్యే శశికళను, దినకరన్‌ను పార్టీ పదవులనుంచి తొలగించిన విషయం తెలిసిందే. మైనారిటీలో పడిపోయిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో విలీనం కావడానికి గాను పళనిస్వామి గ్రూప్ వారిద్దరినీ పక్కన పెట్టేసింది. 
 
దినకరన్ అరెస్టుతో అన్నాడీఎంకేలో శశికళ ప్రాభవం, వైభవం, వారసత్వం ముగిసిపోయినట్లేనని భావిస్తున్నారు.
 

వెబ్దునియా పై చదవండి