లోక్‌సభ ఎన్నికల తర్వాత టెలికాం చార్జీల బాదుడే.. బాదుడు!!

వరుణ్

మంగళవారం, 26 మార్చి 2024 (09:19 IST)
రానున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత టెలికాం చార్జీలు మరింత ప్రియంకానున్నాయి. ఎన్నికలు ముగిసి, కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే టెలికాం ధరలను భారీగా పెంచేందుకు సిద్ధమైపోయాయి. ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో భాగంగా టెలికాం కంపెనీలు వచ్చే సార్వత్రిక ఎన్నిక తర్వాత చార్జీలు పెంచే అవకాశాలున్నాయి. దాదాపు రెండున్నరేళ్లపాటు చార్జీలను స్థిరంగా కొనసాగించిన టెలికాం కంపెనీలు, ఈసారి 15- 20 శాతం వరకు పెంచవచ్చని బ్రోకరేజీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. జూలై-అక్టోబరు మధ్యకాలంలో ఈ పెంపును ప్రకటించవచ్చని భావిస్తున్నాయి. అయితే, అల్పాదాయ వర్గ వినియోగదారులు సైతం భరించగలిగేలా కంపెనీలు చార్జీల పెంపు ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులంటున్నా రు.
 
గత 2021 నవంబరులో టెల్కోలు టారిఫ్‌ను 20-25 శాతం వరకు పెంచాయి. భారతీ ఎయిర్టెల్ తొలుత చార్జీల పెంపును ప్రకటించవచ్చని బ్రోకరేజీ సంస్థలంటున్నాయి. మిగతా ప్రైవేట్ ఆపరేటర్లు జియో, వొడాఫోన్ ఐడియా పెంపుపై భిన్నాభిప్రాయాలున్నాయి. మిగతా కంపెనీలూ ఎయిర్ టెల్ బాటను అనుసరించనున్నాయని కొందరంటుండగా.. జియో మాత్రం తన వినియోగదారుల డేటా వినియోగం పెంపు ద్వారా ఆదాయాన్ని పెంచుకునే వ్యూహాన్ని అనుసరించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ప్రతినెలా కస్టమర్లను కోల్పోతున్న వొడాఫోన్ ఐడియా.. చార్జీలను పెంచే సాహసం చేయకపోవచ్చన్న వాదనలూ విన్పిస్తున్నాయి. అయితే, రీజీ స్పెక్ట్రమ్, నెట్‌వర్క్ విస్తరణ కోసం భారీగా పెట్టుబడులు పెట్టిన టెల్కోలకు ఆదాయాన్ని పెంచుకోవడం అత్యవసరంగా మారింది. గత డిసెంబరుతో ముగిసిన త్రైమాసికం నాటికి ఎయిర్ టెల్ ఆదాయం రూ.208కి చేరింది. జియో ఆదాయం రూ.182, వొడా ఐడియా సగటు రెవెన్యూ మాత్రం కనిష్ఠంగా రూ.145గా నమోదైంది. కొత్తగా పెంచే చార్జీలతో ఎయిర్‌టెల్ ఆదాయం రూ.260 వరకు చేరవచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు