యువతిని లాడ్జీకి తీసుకెళ్లి రేప్ చేసి వీడియో తీశాడు...

ఆదివారం, 17 మార్చి 2019 (15:37 IST)
కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చిలో అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడిన కామాంధులను బహిరంగంగా ఉరితీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుంటే, పొల్లాచ్చి మంటలు ఇంకా ఆరకముందే అదే తరహాలో మరో దారుణం బైటపడింది. నాగపట్టణం జిల్లాకు చెందిన మరో దుర్మార్గుడు యువతుల జీవితాలతో చెలగాటమాడిన వైనం బాధిత ప్రియురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. 
 
ఇదిలావుండగా, పొల్లాచ్చి దోషులను బహిరంగంగా ఉరితీయాలంటూ విద్యార్థినుల ఆందోళనలు శనివారం కూడా కొనసాగాయి. ఇక తాజా సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నాగపట్టినం జిల్లా వెల్లిపాళయంపేట్టై వీధికి చెందిన సుందర్‌ అనే కారు డ్రైవరు, అదే ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ప్రియురాలిని కారైక్కాల్‌లోని ఒక లాడ్జీకి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఇచ్చాడు.
 
ఆమె మత్తులోకి జారుకోగానే లైంగికదాడికి పాల్పడుతూ తన సెల్‌ఫోన్‌ ద్వారా వీడియో చిత్రీకరించాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై లైంగికదాడి జరిగినట్లు తెలుసుకున్న యువతి అతనితో గొడవపెట్టుకుంది. తన సెల్‌ఫోన్‌లోని దృశ్యాలను ఆమెకు చూపించి బైటకు చెప్పావో వీటిని బహిర్గతం చేసి చంపేస్తానని బెదిరించాడు. 
 
అంతటితో వదిలిపెట్టక పదేపదే లైంగికవేధింపులకు పూనుకున్నాడు. దీంతో విసిగిపోయిన యువతి కీల్‌వేలూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుందర్‌ను అరెస్ట్‌ చేసి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదేవిధంగా పలువురు యువతులను బెదిరించి అత్యాచారం చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు