ఈ గొడవంతా నా భార్య వల్లే... మాస్క్ పెట్టుకోవద్దని రెచ్చగొట్టింది...

మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (12:16 IST)
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కట్టలు తెంచుకుంది. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఢిల్లీ పాలకులు అనేక రకాలైన చర్యలు చేపడుతున్నారు. ఇందులోభాగంగా, ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌లు ధరించాలన్న షరతు విధించారు. అయితే, కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మాస్క్‌లు ధరించడం లేదు. ఈ నేపథ్యంలో మాస్కు ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించినందుకు ఢిల్లీ పోలీసులపై ఓ జంట విరుచుకుపడిన వీడియో ఒకటి సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
తాను మాస్క్ పెట్టుకోనని, ఇక్కడే తన భర్తకు ముద్దిస్తానని, అడ్డుకుంటారా? అంటూ సదరు మహిళ... పోలీసులతో వాగ్వాదానికి దిగి వీరంగమేసింది. దీంతో వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత వారిద్దరినీ అరెస్టు చేశారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
ఇదిలావుంటే, పోలీసులతో జరిగిన గొడవపై మహిళ భర్త స్పందిస్తూ.. భార్యను నిందించాడు. ఈ గొడవ మొత్తానికి కారణం తన భార్యేనని పంకజ్ దత్తా పేర్కొన్నాడు. తప్పంతా తన భార్యదేనని, మాస్కు పెట్టుకోవాలని చెబుతున్నా వినలేదని వాపోయాడు. తను మాస్క్ పెట్టుకోలేదు సరికదా, తననూ పెట్టుకోనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
 
మాస్క్ విషయమై తామిద్దరం కారులో గొడవ పడ్డామని, అదే సమయంలో పోలీసులు ఆపారని పేర్కొన్నాడు. పోలీసులతో గొడవ తనకు ఇష్టం లేకున్నా భార్యే తనను రెచ్చగొట్టిందని అన్నాడు. ఆమె పక్కన లేనప్పుడు తాను మాస్క్ ధరిస్తానని చెప్పిన పంకజ్.. అందరూ విధిగా మాస్కులు ధరించాలని చెప్పడం కొసమెరుపు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు