మా కోసం మీరేమి చేయొద్దు.. దయచేసి మాస్కులు ధరించండి.. వైద్యుడి వేడుకోలు

సోమవారం, 19 ఏప్రియల్ 2021 (08:42 IST)
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ బారి నుంచి ప్రతి ఒక్కరూ తమను తాము కాపాడుకోవాలంటే స్వీయ రక్షణే ముఖ్యమని వైద్యులు పదేపదే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ముఖానికి మాస్క్ ధరించి, చేతులను శుభ్రంగా కడుక్కోవాలంటూ కోరుతున్నారు. కానీ, చాలా మంది అవేమీ పట్టించుకోవడం లేదు. అశ్రద్ధగా ఉంటున్నారు. ఫలితంగా కరోనా వైరస్ వ్యాప్తి పీక్ స్టేజ్‌కు చేరిపోయింది. 
 
ఈ పరిస్థితుల్లో ఓ వైద్యుడు ప్రజలకు ఇన్‌స్టాగ్రాం ద్వారా బహిరంగ విన్నపం చేశారు. ఈ విన్నపాన్ని చదివిన వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. రోగుల ప్రాణాలను కాపాడుతున్న మా కోసం మీరేమీ చేయవద్దు, కాని దయచేసి మాస్కులు ధరించండి అంటూ న్యూఢిల్లీకి చెందిన అనస్థీషియ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ సాంధ్రా సెబాస్టియన్‌ ఇన్‌స్టాగ్రాంలో రాశారు. గత రెండు వారాలుగా అనుభవిస్తున్న అంశాలను పూసగుచ్చినట్లు అందించారు.
 
కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో 'మీరు బయటకు వచ్చినప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించండి' అని ప్రజలను అభ్యర్థించారు. డాక్టర్ సాంధ్రా సెబాస్టియన్ తన పోస్ట్‌లో తాను పనిచేస్తున్న దవాఖాన వార్డు ఫొటోను పంచుకున్నారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆసుపత్రిలో కొవిడ్-19 రోగులకు చికిత్స చేస్తున్నప్పుడు ప్రతిరోజూ ఎంతో వేధన భరించవలసి వస్తుందని తన పోస్ట్‌లో వివరించారు.
 
'కరోనా వైరస్‌కుగురై శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్న మహిళలు రాత్రంతా వేదనతో ఏడుస్తూ ఉంటున్నారు. వారు నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఇద్దరు చిన్నారులకు అండగా ఉండాల్సిన తల్లి ఇలా కరోనా మహామ్మారి బారిన పడి జీవచ్ఛవంలా పడి ఉంది. మరోవైపు తమ చిన్నారుల ప్రాణాలను కాపాడమంటూ మోకాళ్లపై మాకు మోకరిల్లడం చూస్తే ఎంత బాధేసిందో మాటల్లో చెప్పలేను. ప్యాక్ చేసిన మృతదేహాలను చూస్తూ.. ఆలోచించడం మానేసి.. నా పనితో ముందుకు సాగాలని నాకు నేను చెప్పుకున్నాను. నేను చేయగలిగినంత కష్టపడి పనిచేస్తున్నాను. ఇతర ఆరోగ్య కార్యకర్తలు కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరితే నా తల్లిదండ్రులు కూడా అదే చేస్తారని కోరుకుంటున్నాను' అని డాక్టర్ సాంధ్రా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు