ముంబై ముష్కరదాడి నిందితుడు లఖ్వీకి పాకిస్థాన్ కోర్టు బెయిల్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో లఖ్వీకి బెయిల్ ఇవ్వడాన్ని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దుయ్యబట్టారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, మూడేళ్లుగా జైల్లో ఉంటూనే లఖ్వీ తండ్రయ్యాడంటే పాకిస్థాన్ లోని జైళ్ల నిర్వహణ తీరుతెన్నులను అర్థం చేసుకోవచ్చని అన్నారు.
ఇదిలా ఉండగా, పెషావర్లో జరిగిన దారుణ మారణకాండతో పాక్ ప్రభుత్వం కళ్లు తెరిచింది. దీంతో ఉరిశిక్ష పడ్డ ఖైదీలను ఉరి తీసేందుకు రంగం సిద్ధం చేసింది. ఆరుగురు తీవ్రవాదులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు ఆర్మీ చీఫ్ రహీల్ క్లియరెన్స్ ఇవ్వడంతో వారిని ఏ క్షణంలో అయినా ఉరి తీసే అవకాశముంది.
కాగా, ఆరుగుర్నీ ఒకేసారి ఉరి తీసేకంటే ముందుగా ఇద్దర్ని ఉరి తీయాలని పాకిస్థాన్ ప్రభుత్వం భావిస్తోంది. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ పై దాడికి యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను ముందుగా ఉరితీసే అవకాశం ఉంది.